Work From Home Policy India: కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ అనే విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాలం మారుతున్నా కొద్దీ పరిస్థితులు క్రమేపీ చక్కపడ్డాయి. మళ్లీ ఇప్పుడు కరోనా ను మించి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగిపోతున్నాయి. చమురు సరఫరా కూడా దారుణంగా ఉంటున్నది. హర్మూజ్ జలసంధిలో ఆంక్షల వల్ల చమురు సరఫరాలో తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొదుపు చర్యలు పాటించాలని హితవు పలికారు. బంగారం కొనుగోలు చేయకూడదని, అంతర్జాతీయంగా ప్రయాణాలు సాగించొద్దని.. సూచించారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు కలిగించాయి. బంగారం వినియోగాన్ని తగ్గించేందుకు, చమురు వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్రం సుంకాలు, ధరలు పెంచడం మొదలుపెట్టింది. చమురు మీద నాలుగు సార్లు ధరలు పెంచింది. ఇంకా ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారం మీద సుంకం పెంచిన నేపథ్యంలో ధరలు ఆకాశమార్గంలో విహరిస్తున్నాయి.
నరేంద్రమోడీ సూచనల నేపథ్యంలో దేశీయంగా అనేక సంస్థలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనదేశంలో ఆటోమోబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీ తన ఉద్యోగుల విషయంలో కీలక ప్రకటన చేసింది.ఆన్ ఫీల్డ్ లో పని చేయాల్సిన అవసరం లేదని మారుతీ సుజుకీ కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించింది. విదేశీ పర్యటనలు చేసే ఉద్యోగులు కేవలం కంపెనీ అవసరాల కోసం మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశాలు మాత్రమే కాదు, దేశీయంగా కూడా ప్రయాణాలను తగ్గించుకోవాలని ఉద్యోగులకు స్పష్టం చేసింది. కేవలం ఆన్ లైన్ విధానంలో సమావేశాలకు మాత్రమే హాజరు కావాలని సూచించింది.
‘పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. చక్కబడేవరకు జాగ్రత్తగా ఉండాలని మా ఉద్యోగులకు చెబుతున్నాం. పెట్రోలియం వాడకం తగ్గించాలి. అవసరం ఉంటేనే ప్రయాణాలు చేయాలి. ఉద్యోగులు ఇంటివద్ద నుంచి పని చేసే సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. అందువల్లే ఈ నిర్ణయాలను తీసుకున్నామని’ మారుతీ సుజుకీ నిర్వాహకులు ప్రకటించారు.
