తెలంగాణ – ఏపీ మధ్య మొదలైన జల వివాదం పవర్ వార్ గా టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నప్పుడు.. తాము మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉండాలన్న రీతిలో వ్యవహరిస్తోంది తెలంగాణ. ఇందులో భాగంగానే.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టింది. పోలీసు పహారా ఏర్పాటు చేసి మరీ, నిరంతరాయంగా కొనసాగిస్తోంది.
దీనివల్ల ఆయా ప్రాజెక్టుల్లోని నీళ్లు ఖాళీ అవుతున్నాయి. ఆ నీళ్లన్నీ ఏపీ వైపునకు రావడం.. ప్రకాశం బ్యారేజీ నిండిపోవడంతో అనివార్యం గేట్లు ఎత్తడం.. ఫలితంగా సముద్రాన్ని వెతుక్కుంటూ నీళ్లు వెళ్లిపోవడం జరుగుతోంది. ఈ పరిస్థితిని వెంటనే అడ్డుకోవాలంటూ ఏపీ సర్కారు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అక్కడి నుంచి వెంటనే స్పందన రాకపోవడంతో.. కేంద్రానికి సైతం ఉత్తరం పంపింది. కానీ.. కేంద్రం కూడా ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.
ఇక్కడ మాత్రం ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా స్పందించిన కృష్ణాబోర్డు ఈ నెల 9వ తేదీన రెండు రాష్ట్రాల అధికారులు కలిసి మాట్లాడుకుందాం అని సమాధానం పంపింది. అయితే.. అప్పటి వరకు ఈ విద్యుత్ ఉత్పత్తి ఇలాగే సాగిపోతే.. నీళ్లు మొత్తం ఇంకిపోవడం ఖాయమన్నది ఏపీ ఆందోళన. అయినప్పటికీ ఉపయోగం లేని పరిస్థితి కనిపిస్తోంది.
అటు కేంద్రం కూడా ఏపీ లేఖను లైట్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అటు ప్రధాని నుంచికానీ.. ఇటు కేంద్ర జలశక్తి నుంచి కానీ రెస్పాన్స్ రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందనే విమర్శలు ఉన్నాయి. వీటిని పరిశీలించేందుకు కృష్ణాబోర్డు సభ్యులు వస్తామంటే.. ఏపీ అంగీకారం తెలపలేదు. ఈ కారణాలతోపాటు.. రాజకీయంగా చూసుకున్నప్పుడు కూడా బీజేపీకి తెలంగాణ చాలా కీలకం. ఈ కారణాలతోనే కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ విధంగా చూసుకున్నప్పుడు తొమ్మిదో తేదీ వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చనే సూచనలే కనిపిస్తున్నాయి. మరి, అప్పటి వరకూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుందా? ఆపుతుందా? అన్నది తెలియదు. ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా.. అనే ధీమా కూడా ఉండొచ్చని అంటున్నారు. మొత్తంగా.. ఈ సమస్య ఏ మలుపు తీసుకోనుందన్న విషయం మాత్రం.. కృష్ణాబోర్డు నిర్వహించే రెండు రాష్ట్రాల భేటీ తర్వాతనే తేలనుంది.