Bollywood actress complaint :లేని కేసులను పెట్టి భయపెట్టే రోజులు ఇవి. రాజకీయ ప్రత్యర్థులపై లేనిపోని కేసులు పెట్టి వెంటాడడం అలవాటైన విద్యగా మారింది. గత ఐదేళ్లుగా టిడిపి నేతలను వైసీపీ ప్రభుత్వం ఎంత వేటాడిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసుల పరంపర నడుస్తోంది. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మీరు అలా చేశారు కాబట్టి.. మేం కూడా అలానే చేస్తాం అన్నట్టు పరిస్థితి ఉంది. అటువంటిది ఆధారాలతో దొరికితే ప్రభుత్వం ఊరుకుంటుందా? కచ్చితంగా సీరియస్ యాక్షన్ కు దిగుతుంది. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్నది అదే. ఓ కుటుంబ వ్యవహారంలో ముంబాయి నటి కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చి వేధించినట్లు ఒక వార్త బయటకు వచ్చింది. తెలుగు రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది. సదరు నటి, ఆమె కుటుంబం తప్పు చేయకపోయినా విజయవాడ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. విమానాల్లో వెళ్లి మరి ఆ కుటుంబాన్ని అరెస్టు చేసి తీసుకువచ్చారు. అన్ని రకాల భయపెట్టి సెటిల్మెంట్ చేసి తిరిగి పంపించారు. అయితే ప్రభుత్వం మారింది. నాటి సెటిల్మెంట్ బయటకు వచ్చింది. ఇందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని తేలింది. అందుకే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలైన సదరు నటి తిరిగి కేసు పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది.
* పెళ్లి విషయంలో వివాదం
ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో బాలీవుడ్ నటి కదంబరి జత్వాని ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు వారి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి సదరు పారిశ్రామికవేత్త కుటుంబం అడ్డం తిరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వివాహం వద్దని వారించడంతో.. ఆ నటి సైతం పట్టు పట్టింది. అయితే సదరు పారిశ్రామికవేత్త నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలకు చెప్పడంతో సీన్ మారింది. ముంబై కేసు కాస్త విజయవాడకు మారింది. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో నటిపై కేసు పెట్టించారు. ఆ వ్యక్తితో ఆ నటికి ఎటువంటి లావాదేవీలు జరగలేదు. కానీ ఓ ఐపీఎస్ అధికారి అతిగా వ్యవహరించి ఆ నటిని భయపెట్టారు. జైలు వరకు తీసుకెళ్లారు. దీంతో భయపడిన సదరు నటి తనకు వివాహం అక్కర్లేదని చెప్పి కుటుంబ సభ్యులను తీసుకెళ్లి పోయింది
* సీఎంవో సీరియస్
అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుండడంతో ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. సీఎంఓ కు పూర్తి నివేదిక అందించారు. ఈ కేసు విషయంలో సీఎం ఓ కూడా సీరియస్ గా ఉంది. వ్యవస్థలను ఇలా మాఫియా స్టైల్ లో వాడుకున్న వైనంపై కఠిన చర్యలు తీసుకోకపోతే పునరావృతం అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే ఈ ఎపిసోడ్ నడిపిన ఐపీఎస్ అధికారిపై వేటు వేయాలని భావిస్తోంది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చూస్తోంది. నాటి ఘటనతో పాలుపంచుకున్న పోలీసులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.
* ఫిర్యాదు చేసేందుకు ఆమె రెడీ
అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడం, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే ఈ తతంగం జరగడంతో బాధితురాలు అయిన నటి భయపడిపోయింది. కానీ నాడు తన విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉంది. మీరు వచ్చి ఫిర్యాదు చేస్తే తదుపరి యాక్షన్ చర్యలు ఉంటాయని.. మీకు పూర్తి భరోసా మేము అంటూ ఏపీ నుంచి సదరు నాటికి హామీ వెళ్లినట్లు సమాచారం. ఆమె సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎన్నో సంచలనాలకు ఏపీ వేదికగా మారనుంది. మున్ముందు ఈ పరిణామాలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More