Aditya L1 Solar Mission
Aditya L1 Solar Mission: చంద్రుడిపై అధ్యయనానికి ఇస్ట్రో పంపిన చంద్రయాన్–3 ఇప్పటికే ఆశించిన దానికన్నా ఎక్కువ పనితీరు కనబర్చి ఆశ్చర్య పర్చింది. ప్రస్తుతం చంద్రునిపై చీకటి ఉండడంతో స్లీప్ మోడ్లోకి పంపించారు సైంటిస్టులు.. ఇప్పుడ ఆదిత్య ఎల్–1 కూడా తన పనితీరుతో ఆశ్చర్య పరుస్తోంది. భూమి, చంద్రుడు ఒకే ఫ్రేమ్ లో కన్పించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని ఆదిత్య–ఎల్1 క్లిక్ మనిపించింది. ఆ ఫొటోను ఇస్రోట సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
కొనసాగుతున్న ఆదిత్య ప్రయాణం..
సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య–ఎల్ 1 విజయవంతంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే భానుడి దిశగా పయనిస్తోన్న మన ఆదిత్య ఓ సారి పుడమిని చూసి మురిసి పోయింది. ఈ సమయంలోనే తొంగి చూస్తున్నట్లు చందమామ కూడా కనిపించాడు. ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించి పనిలో పనిగా నేను క్షేమమే అన్నట్లు ఓ సెల్ఫీ కూడా తీసుకొని ఇస్రోకు పంపింది. ఆ అద్భుత దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసింది. సెప్టెంబరు 4వ తేదీన ఆదిత్య–ఎల్ 1లోని కెమెరా ఈ సెల్ఫీ తీసినట్లు ఇస్రో వివరించింది.
సెల్ఫీలో ఇలా..
ఆదిత్య ఎల్1లోని విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ ఆల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఈ సెల్ఫీ ఫొటోలో కన్పించాయి. దీంతో పాటు భూమి, చంద్రుడు ఒకేసారి కన్పించిన దృశ్యాలను కూడా ఆదిత్య–ఎల్ 1 క్లిక్ మనిపించింది. ఈ చిత్రాలతో కూడిన వీడియోను ఇస్రో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ‘భూమి–సూర్యుడి మధ్యలోని లగ్రాంజ్ పాయింట్కు ప్రయాణంలో ఆదిత్య–ఎల్ 1 వీక్షించిన దృశ్యాలివి’ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది.
ఆదిత్య–ఎల్ 1లోని విజిబుల్ ఎమిషన్ లైన్లో కరోనాగ్రాఫ్ సూర్యుడి కరోనా, స్పెక్ట్రోస్కోపీని అధ్యయనం చేయనుంది. ఇక ఎస్యూటీ ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ను పరిశీలించనుంది.
విజయవంతంగా కక్ష్య పెంపు..
సెప్టెంబరు 2న ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇటీవలే రెండోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ విన్యాసంతో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం 282కి.మీ గీ 40,225 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబరు 10న చేపట్టనున్నారు.
నాలుగు నెలల సుదీర్ఘ ప్రయాణం..
ఆదిత్య–ఎల్ 1 ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ’ఎల్1’ (లగ్రాంజ్) పాయింట్ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ చేరుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో ఏడు రకాల పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమోస్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఉపగ్రహాలు, ఇతర పరిశోధనాశాలలను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Aditya-L1 Mission:
👀Onlooker!Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy— ISRO (@isro) September 7, 2023