Homeజాతీయంఐపీఎల్‌పై కరోనా కాటు.. షెడ్యూల్‌లో భారీ మార్పులు!

ఐపీఎల్‌పై కరోనా కాటు.. షెడ్యూల్‌లో భారీ మార్పులు!


క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) పదమూడో సీజన్‌ సజావుగా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ మెగా లీగ్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. లీగ్‌లో అత్యధిక ప్రజాదరణ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే) కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ఆ జట్టులో ఒక ప్లేయర్, కొందరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ టీమ్‌లో మరో ప్లేయర్ కూడా వైరస్‌ సోకింది. బీసీసీఐ లెక్కల ప్రకారం ఇద్దరు క్రికెటర్లు సహా 13 మందికి పాజిటివ్‌ అని తేలింది. కానీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం టీమ్‌లో 20 మందిపైనే వైరస్‌ బారిన పడ్డారట. ఇందులో ప్లేయర్లే 12-13 మంది ఉన్నట్టు సమాచారం. సురేశ్‌ రైనా టోర్నీ నుంచి వైదొలిగి స్వదేశానికి తిరిగి రావడానికి కారణం కూడా ఇదే అన్న అభిప్రాయం కలుగుతోంది. జట్టులో ఇంత మందికి పాజిటివ్‌ అని తేలడంతో ఆట లేదు ఏం లేదు ఇంటికొచ్చెయ్‌ అని రైనా కుటుంబ సభ్యులు అతనిపై ఒత్తిడి తెచ్చారట. అందుకే పెట్టేబేడా సర్దుకొని అతను స్వదేశానికి వచ్చాడని తెలుస్తోంది. ఏం చెప్పాలో తెలియకే వ్యక్తిగత కారణాల వల్ల అతను లీగ్‌కు దూరమయ్యాడని సీఎస్కే మేనేజ్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసిందని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: చెన్నై టీమ్‌కు మరో షాక్..‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న సురేశ్‌ రైనా

ఒక్క చెన్నై టీమ్‌లోనే ఇంత మందికి పాజిటివ్‌ అని తేలడంతో ఐపీఎల్‌ నిర్వహణపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ 19వ తేదీనే లీగ్‌ మొదలవుతుందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే, టోర్నీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదని బీసీసీఐ అంటోంది. 19వ తేదీనే షురూ అవుతుందని చెబుతోంది. కానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తే లీగ్‌ షెడ్యూల్‌లో మార్పులు అనివార్యం అనిపిస్తోంది. షెడ్యూల్‌ ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ చివరి సీజన్‌లో విజేత, రన్నరప్‌ మధ్య మ్యాచ్‌తో కొత్త సీజన్‌ను మొదలు పెట్టడం ఆనవాయితీ. అది అధికారిక రూల్ కూడా. ఈ లెక్కన గత సీజన్‌లో విన్నర్ ముంబై ఇండియన్స్‌, రన్నరప్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ సెప్టెంబర్19వ తేదీన తొలి మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. కానీ, అది జరిగేలా లేదు.

ఇప్పుడు చెన్నై టీమ్‌లో చాలా మందికి వైరస్‌ సోకింది. బీసీసీఐ మార్గనిర్దేశాల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులంతా 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. వారితో కాంటాక్ట్‌ అయిన వారిని సైతం క్వారంటైన్‌ చేయాలి. ఈ లెక్కన చెన్నై జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బందిలో సగం మంది ఇంకో రెండు వారాల పాటు హోటల్‌ గదులకే పరిమితం అవుతారు. 14 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో రెండుసార్లు నెగెటివ్ రిజల్ట్‌ వస్తేనే వారిని ఇతర ఆటగాళ్లతో కలిసి ఆడేందుకు అనుమతిస్తారు. టోర్నీకి ఇంకా 22 రోజుల సమయం ఉన్నప్పటికీ సీఎస్కే టీమ్‌లో డజను మంది ఆటగాళ్లు 14 రోజుల ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్నాక వారికి మిగిలేది వారం రోజులే. ఇంత తక్కువ సమయంలో ప్రాక్టీస్ చేసి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం చాలా కష్టం.

Also Read: నేడు ఖేల్ రత్న అందుకోనున్న రోహిత్ శర్మ

అందుకే, లీగ్‌ ఆరంభంలో చెన్నై ఆడాల్సిన మ్యాచ్‌లను వెనక్కు జరపాలని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భావిస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 19వ తేదీన తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై పోటీ పడే అవకాశం లేదు. అందుకే ఈ వారంతంలోనే షెడ్యూల్‌ను రిలీజ్‌ చేయాలని నిర్ణయించిన బీసీసీఐ ఆ ఆలోచన విరమించుకుందట. చెన్నై టీమ్‌ను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్‌లో మార్పులు చేయాలని చూస్తోంది. దాంతో, షెడ్యూల్‌ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. ఇదంతా చూస్తుంటే ఐపీఎల్‌ సజావుగా జరుగుతుందో లేదో అని అభిమానులు కలవరపడుతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular