Homeఅత్యంత ప్రజాదరణమొక్కజొన్న సాగు వద్దంటున్న ప్రభుత్వం.. అసలు మతలబేంటి?

మొక్కజొన్న సాగు వద్దంటున్న ప్రభుత్వం.. అసలు మతలబేంటి?

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించలేక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ నిర్బంధ సాగు అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలని షరతులు విధించింది. ఇప్పటికే వానాకాలంలో మొక్కజొన్న సాగు వద్దన్న సర్కార్‌‌.. వచ్చే యాసంగిలోనూ మొక్కజొన్న సాగు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎంఎస్‌పీతో పంటలు కొని.. వాటిని ప్రాసెస్‌ అమ్ముకునే అవకాశాలు ఉన్నా ఆ వైపు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో వరి పంటపైనా ఆంక్షలు పెట్టే అవకాశం లేకపోలేదని అగ్రికల్చర్‌‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే.. తెలంగాణ రైతులు ప్రధానంగా వర్షాధార పంటలనే సాగు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఇక్కడ మొక్కజొన్న సాగు కూడా ఎక్కవే. సీఎం కేసీఆర్‌‌ నిర్బంధ సాగులో భాగంగా వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని చెప్పినా చాలా వరకు రైతులు సాగు చేశారు. దీంతో ఈ రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.

సీఎం కేసీఆర్‌‌ శనివారం కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. అందులో ప్రధానం వ్యవసాయంపైనే చర్చ పెట్టారు. ఇందులో ప్రధానంగా మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చుడు అసాధ్యమని, యాసంగిలో మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వానికి బాధ్యత కాదని స్పష్టం చేశారు. జాతీయ ,అంతర్జాతీయంగానూ మొక్కజొన్నలకు డిమాండ్‌ లేదని తేల్చి చెప్పారు. పౌల్ట్రీ వ్యాపారులతో చర్చలు జరిపినా వారు కొనేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. బీహార్‌‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, రాజస్తాన్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కోళ్ల దాణా తక్కువ ధరకే దొరుకుతుండడంతో ఇక్కడ పండిన పంటను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతీ వానాకాలం సీజన్‌లో 14 లక్షల నుంచి 17 వరకు మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఉండేది. ఏటా 16 లక్షల నుంచి 27 లక్షల టన్నుల వరకు దిగుబడి వచ్చేది. ఈ నిర్బంధ సాగుతో ఈసారి కేవలం 2.25 లక్షల ఎకరాల్లోనే వేశారు. ఈ సీజన్‌కు 7.65 లక్షల టన్నుల పంట దిగుబడి రావొచ్చని ఆఫీసర్లు అంచనా వేశారు. క్వింటాల్‌ ధర రూ.1850 ఉండగా.. ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఈసారి రైతులకు రూ.500 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. అటు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లోనూ 28 కోట్ల టన్నుల మొక్కజొన్న నిల్వ ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 3.53 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. దేశం మొత్తం 2.42 కోట్ల టన్నులు మాత్రమే అవసరమని చెప్పుకొచ్చారు. ఒక్క వానాకాలంలో దేశవ్యాప్తంగా 2.04 కోట్ల ఎకరాల్లో పంట సాగు చేశారని, 4,10 కోట్ల టన్నుల పంట త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోందని సీఎం అంటున్నారు.

మరోవైపు.. మొక్కజొన్న పంటను ప్రాసెస్‌ చేస్తే మంచి డిమాండ్‌ ఉంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. మొక్కజొన్నలను పశువులు, కోళ్లు, చేపలకు దాణాగా, బిస్కెట్లు, బేకరీ పదార్థాల తయారీలో వాడుతున్నారు. ఈ గింజల నుంచి స్టార్చ్‌, గ్లూకోజ్‌, సుక్రోజ్‌, గమ్స్‌ తదితరాల కూడా తయారు చేస్తారు. అల్కహాల్‌, ఇథనాల్‌ వంటి కెమికల్‌ కూడా తయారవుతాయి. పాప్‌కార్న్‌, కార్న్‌ ఫ్లేక్స్‌తోపాటు లేత బేబీకార్న్‌తో కూరలు చేసుకోవచ్చు. అంతేకాదు.. మక్కల నుంచి తీసిన నూనెలో కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటుంది. సూప్‌ మిక్స్‌, ఇన్‌స్టంట్‌ కార్న్‌పప్స్‌, ఉప్మామిక్స్‌, కేసర్‌‌ బాత్‌ ఇలా ఎన్నో స్నాక్స్‌ తయారు చేయచ్చు. చాలాచోట్ల వీటితో బీర్లు, విస్కీ కూడా తయారుచేస్తుంటారు.

కానీ.. ఈ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ మాత్రం మొక్కజొన్నలకు డిమాండ్‌ లేదని, నిల్వలు పేరుకుపోతున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. ఆరేళ్లుగా ప్రభుత్వం ప్రాసెసింగ్‌ పై మాత్రం దృష్టి పెట్టడం లేదు. గుడ్డిగా మొక్కజొన్న సాగు చేయవద్దంటూ ఆంక్షలు విధిస్తోంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇలాంటి దుస్తితి పట్టినట్లుగా అర్తమవుతోంది. మరోవైపు మార్క్‌ఫెడ్‌ ఆఫీసర్ల అవినీతి కూడా ఇందుకు కారణమైంది. దీంతో ఏటా ప్రభుత్వానికి కూడా నష్టం వస్తూనే ఉంది. కనీసం మార్క్‌ఫెడ్‌ కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రాసెసింగ్‌ చేసి నిల్వ ఉన్న మక్కలను అమ్మాల్సి ఉన్నా.. తనకేంటి అన్నట్లు వ్యవహరించడం ఇప్పుడు రైతుల పాలిట శాపంలా మారింది.

మార్క్‌ఫెడ్‌ నిర్లక్ష్యం కారణంగా గత నాలుగు సీజన్లలో రూ.533 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. గత యాసంగిలో 9.42 లక్షల టన్నులు కొన్న ప్రభుత్వం ఇప్పటికీ వాటిని అమ్మలేదు. అమ్మినవాటిని కూడా చాలా తక్కువకే కట్టబెట్టారు. పంటను అమ్ముకునే ప్రయత్నం చేయలేని ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్‌ మక్కలను కొనలేమంటూ తేల్చి చుబుతోంది. వీటన్నింటినీ చూస్తే.. ఇక మున్ముందు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇక మొక్కజొన్న సాగును మరిచిపోవాల్సిన ప్రమాదమే కనిపిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular