తెలంగాణలో ప్రస్తుతం షర్మిల రాజకీయ పార్టీపై తీవ్ర చర్చ జరుగుతోంది. అతి త్వరలో ఆమె కొత్త పార్టీ పెట్టనున్నారన్న వార్తలతో తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనూ రాజకీయంగా హాట్ టాపిక్గా కొనసాగుతోంది. ఆమె పార్టీ నిలబడుతుందా..? షర్మిల అనుకుంటున్న వైఎస్ అభిమానులు ఆమెను ఆదరిస్తారా..? వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో షర్మిల పార్టీ విజయం సాధిస్తుంది…? అన్న కోణంలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పనిచేసిన కొందరు అప్పటి కాంగ్రెస్ నాయకులు షర్మిల పార్టీపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వారిలో వైఎస్ కు సన్నిహితుడిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలేంటో ఇప్పుడు చూద్దాం. .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ది ప్రత్యేక స్థానం. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లోని ముఖ్య సభ్యల్లో ఏపీ నుంచి ఈయన ఒకరు. సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఆమె టాన్స్ లేషన్ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విషయం అప్పటి నాయకులకు తెలుసు. అయితే రాను రాను అప్పుడప్పుడు మీడియాలో తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదని కొందరు అంటున్నారు.
తాజాగా ఆయన షర్మిల పార్టీపై కొన్ని సంచలన కామెంట్లు చేశారు. షర్మిల పార్టీ పెట్టడం ఆశ్చర్యమేమీ కాదన్నారు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు వేరు వేరు పార్టీల పెట్టడం పెద్ద విషయం కాదన్నారు. మరోవైపు అన్న ఏపీ సీఎం జగన్ అండ షర్మిలకు ఉంటుందన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఇమేజ్ పోయిందని, ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవానే కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే షర్మిల వైఎస్ అభిమానుల ఆధారంగా తెలంగాణలో పార్టీ పెడుతోందన్నారు.
ఇక తెలంగాణలో ఇంకా వైఎస్ అభిమానులు ఆయనను ఆదరిస్తున్నారని, షర్మిల పార్టీకి వారి మద్దతు ఉంటుందన్నారు. షర్మిల పార్టీ పెట్టడానికి డబ్బు అవసరం లేదని, గతంలో ఎన్టీరామారావు కేవలం ప్రజల మద్దతుతోనే పార్టీ ప్రారంభించారన్నారు. ఇప్పుడు షర్మిల కూడా వైఎస్ అభిమానులతో పార్టీ ప్రారంభిస్తారన్నారు.
ఇదిలా ఉండగా షర్మిల పార్టీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె పార్టీ పేరు ఎలా ఉంటుంది..? గుర్తు ఏముంటుంది..? అన్న చర్చ జరుగుతోంది. ఇక ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులు షర్మిల పార్టీలోకి వెళ్లాలా..? లేదా..? అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.