Homeఅత్యంత ప్రజాదరణసీఎంపై తుది నిర్ణయం జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్ లదేనా?

సీఎంపై తుది నిర్ణయం జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్ లదేనా?

ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న చేసిన కామెంట్స్ హైలెట్ అయ్యాయి. వాటిని కొన్ని మీడియా సంస్థలు చిలవలు పలువలు చేసి రచ్చ చేశాయి. బీజేపీ తరుఫున బీసీనే ముఖ్యమంత్రిని సోము వీర్రాజు చేస్తున్నాడని ప్రచారం చేశాయి. అయితే ఆయన అన్నది మాత్రం బీజేపీలో బీసీలు, ఎస్సీలు సైతం సీఎంలు కావచ్చని.. ఆ స్వేచ్ఛ వైసీపీ, టీడీపీలో లేదని వ్యాఖ్యానించారు.

అయితే మీడియా తన మాటలను వక్రీకరించడంతో తాజాగా మరోసారి వివరణ ఇచ్చారు. బీజేపీ సకల జనుల పార్టీ అని.. మా పార్టీలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. బీసీ అయిన నరేంద్రమోడీ గారిని ప్రధానిని చేసింది బీజేపీ అని చెప్పుకొచ్చారు. వైసీపీ, టీడీపీ పార్టీలు బీసీని ముఖ్యమంత్రిని చేయగలవా? అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు వారసత్వ పార్టీలు అంటూ విమర్శించారు. అయితే ఈ క్రమంలోనే సోము వీర్రాజు బీజేపీ సీఎం అభ్యర్థిపై చేసిన చేసిన ప్రకటనతో మరోసారి ఆయన పలుచన అయిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిన్నటి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే క్రమంలోనే సోము వీర్రాజు ఏపీ బీజేపీ సీఎం క్యాండిడేట్ పై ఓ ప్రకటన చేశారు. ‘బిజెపి లో మా పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా గారు, మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చర్చించి ముఖ్యమంత్రి పై నిర్ణయం తీసుకుంటారు’ అని స్పష్టం చేశారు. ఈ ప్రకటన గందరగోళానికి దారితీసింది.

ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ ను డిసైడ్ చేస్తానని అనడంపై సగటు బీజేపీ వాదులు నొచ్చుకున్న పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కంటే కూడా ఇప్పుడు ఏపీలో క్షేత్రస్థాయి నుంచి బీజేపీకి బలం ఉంది. పవన్ అమావాస్య పౌర్ణమికి మాత్రమే ఏపీలో పర్యటిస్తుంటే.. సోము వీర్రాజు ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. బీజేపీని ఏపీలో టీడీపీకి ప్రత్యామ్మాయంగా తీర్చిదిద్దుతున్నాడు.

ఇక జనసేన మాత్రం ఇప్పటికీ బూత్ స్తాయి నుంచి కార్యకర్తలు నేతల బలం లేకుండా స్తబ్దుగా ఉంది. జనసేనలో ఒక్క పవన్ తప్పితే వేరే పెద్ద నాయకుడు లేడు. అదే బీజేపీలో చాలా మంది పెద్ద పెద్ద నేతలు ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఒకవేళ ఏపీలో వచ్చేసారి బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ సోము వీర్రాజుకు దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత బలంగా నిలబడుతున్న ఆయనను కాదని.. ఏపీలో సీఎం క్యాండిడేట్ ను పవన్ డిసైడ్ చేస్తా అనడమే ఇప్పుడు బీజేపీ శ్రేణులకు మింగుడుపడని అంశంగా మారింది.

నిన్నటి బీసీలు సీఎం అవ్వగలరన్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇక తనకు ఎందుకొచ్చిన లొల్లి అని సీఎం అభ్యర్థిపై నిర్ణయాన్ని సోము వీర్రాజు అధిష్టానం-పవన్ చేతుల్లో పెట్టడాన్ని ఆయన అభిమానులు మాత్రం జీర్ణించుకోవడం లేదు. పవన్ కంటే కూడా ప్రజల్లోకి వెళుతున్న సోము వీర్రాజు సీఎం అభ్యర్థి విషయంలో ఇలా స్పందించడం ఇప్పుడు ఏపీ బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular