బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణం కేసులో ట్విస్టుల ట్విస్టులు నడుస్తున్నాయి. తాజాగా రియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మెరుపుదాడులు చేసింది. గురువారం జైద్ విలాత్రా మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు మరింత ఉధృతం చేసింది. శుక్రవారం ఉదయమే సుశాంత్ మేనేజర్ శ్యామూల్ మిరాండా, రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి నివాసాలపై మూకుమ్మడి దాడులు చేసింది. అనంతరం శ్యామూల్, షోవిక్ చక్రవర్తిలకు సమన్లు జారీ చేసి వారిని అదుపులోకి తీసుకోవడం సంచనలనంగా మారింది.
గత కొద్ది రోజులుగా డ్రగ్స్ సప్లయిర్స్ చెప్పిన విషయాలకు, శ్యామూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తి, రియా చక్రవర్తి చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో ఎన్సీబీ రంగంలోకి దిగింది. కేసును లోతుగా విచారిస్తూ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరింత సమాచారం కోసం తాజాగా శ్యామూల్, రియా నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలకు దిగింది. సుమారు నాలుగు గంటలపాటు సోదాలు నిర్వహించారు. అనంతరం షోవిక్, శ్యామూల్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రియా చక్రవర్తి నివాసంపై దాడులు, సోదాలు నిర్వహించి ఆమె ఇంటి నుంచి షోవిక్ చక్రవర్తి లాప్టాప్, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. తాజాగా జైద్ విలాత్రా, బాసిత్తో ఉన్న సంబంధాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే బాసిత్ను కస్టడీలోకి తీసుకొన్నారు.
రియా చక్రవర్తి నివాసంపై దాడులు నిర్వహించిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరో జోనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎంకే జైన్ అధికారికంగా మీడియాకు కొన్ని విషయాలు వెల్లడించారు. ‘షోవిక్ చక్రవర్తి, రియా చక్రవర్తి నివాసాలపై దాడులు నిర్వహించాం. వారిని సంయుక్త విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశాం. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వారిని విచారిస్తాం’ అని ఆయన తెలిపారు. ఈ విచారణలోనూ ఈ కేసు కొలిక్కి వస్తుందేమో చూడాలి.