T20 World Cup 2022 India vs Bangladesh: టి20 మెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ జట్టు నేడు బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. దక్షిణాఫ్రికాతో పరాజయం తర్వాత భారత జట్టు సెమీస్ లోకి వెళ్లాలి అంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. అదే దశలో బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యం. ఈ మ్యాచ్లో గనుక గెలిస్తే సెమిస్ కు వెళ్లే అవకాశాలను కలిగి ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ మ్యాచ్లో గనుక ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ప్రస్తుతం టీం ఇండియా మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో విజయాలు సాధించి, ఒక మ్యాచ్ లో ఓటమి పాలయింది. నాలుగు పాయింట్లు గ్రూప్ 2 లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక బంగ్లాదేశ్ కూడా మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, ఒక మ్యాచ్లో ఓటమిపాలై మూడో స్థానంలో కొనసాగుతోంది.

టీం ఇండియా పై అందరి దృష్టి
నేటి మ్యాచ్ లో టీమిండియా జట్టుపై అందరి దృష్టి నెలకొంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ కు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. స్పెషలిస్ట్ ఓపెనర్ లేకపోవడంతో అతని ప్లేస్ కు డోకా లేకపోవచ్చు. వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైన రాహుల్ బంగ్లా పై ఆయన ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. ఇక దినేష్ కార్తీక్ ఫిట్నెస్ పై అనుమానాలు ఉన్నాయి. అతను ఫిట్టిగా లేకపోతే రిషబ్ పంత్ తుది జట్టులోకి రావడం గ్యారంటీ. దీపక్ హుడా స్థానంలో రిషబ్ ను ఆడించాలని డిమాండ్స్ వస్తున్నాయి. బౌలింగ్ లో కూడా అశ్విన్ స్థానంలో చాహాల్ ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. గత మూడు మ్యాచ్ల్లో అశ్విన్ గొప్పగా బౌలింగ్ చేసింది లేదు. ముఖ్యంగా గత మ్యాచ్లో 18వ ఓవర్లో అశ్విన్ భారీగా పరుగులు సమర్పించుకొని టీం ఇండియా ఓటమికి ఒక కారణమయ్యాడు. ఈ మ్యాచ్ లో అయినా చాహల్ కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
భువనేశ్వర్, షమీ, అర్ష్ దీప్ ఆకట్టుకుంటున్నారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో.. ఈ మ్యాచ్లో బ్యాటర్లదే కీలక పాత్ర అవవకాశం కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు సాధిస్తే.. మిగతా పని పూర్తి చేసేందుకు బౌలర్లు సిద్ధంగా ఉన్నారు.
బంగ్లా జట్టు ఫామ్ లోనే ఉంది
బంగ్లాదేశ్ కూడా మంచి ఫామ్ లోనే కనిపిస్తోంది. వరల్డ్ కప్ గెలిచేందుకు రాలేదని.. భారత జట్టును ఓడించేందుకే వచ్చామంటూ బంగ్లా కెప్టెన్ షకిబుల్ హాసన్ ఇప్పటికే ఒక హెచ్చరిక పంపాడు. అతని మాటలు చూస్తుంటే టీమిండియాతో మ్యాచ్ కు గట్టిగానే సన్నద్ధమై వచ్చినట్టు తెలుస్తోంది. అతనితోపాటు ఆసిఫ్ హుస్సేన్, మొసా దెక్ హుస్సేన్, సౌమ్య సర్కార్ వంటి స్టార్ ఆల్ రౌండర్లతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. పేసర్ తస్కిన్ అహ్మద్ ఈ టోర్నీలో సూపర్ గా బౌలింగ్ చేస్తున్నాడు. మరో పేసర్ ముస్తాఫిజూర్ ఎప్పటికైనా ప్రమాదకారే. నజ్ముల్ శాంటో మంచి ఫామ్ లో ఉండటం బంగ్లాకు కలిసి వచ్చే అంశం లిటన్ దాస్ ఎప్పుడైనా రెచ్చిపోగలడు. నెదర్లాండ్స్, జింబాంబ్వే వంటి జట్లను ఓడించి బంగ్లా జట్టు మంచి ఊపులో ఉంది.

ఏమాత్రం చిన్న అవకాశం వచ్చినా భారత జట్టుకు షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ మాదిరే భారత ఆటగాళ్లు నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదే సమయంలో 2016లో టి20 మెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ లో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడింది. దాదాపు టీం ఇండియాలో ఓడించినంత పని చేసింది. అందుకే బంగ్లా జట్టును భారత జట్టు ఏమంత తేలికగా తీసుకోవద్దు.