spot_img
Homeఎడ్యుకేషన్Infosys: ఇదీ కంపెనీ అంటే.. ఇన్ఫోసిస్ చేసిన పనికి ఉద్యోగులకు ఆనందభాష్పాలు

Infosys: ఇదీ కంపెనీ అంటే.. ఇన్ఫోసిస్ చేసిన పనికి ఉద్యోగులకు ఆనందభాష్పాలు

Infosys: ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మొన్నటిదాకా ఐదు అంకెల స్థాయిలో జీతాలు తీసుకున్న వారి ముఖాలు మలమల మాడిపోతున్నాయి. గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ దాకా భారీగా కోతలు విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏ ఉద్యోగి అయినా సంస్థ నుంచి ఏం కోరుకుంటాడు? లేదా సంస్థ ఏం తిరిగి ఇస్తుంది? దీనికి ఉద్యోగం ఉంటే చాలు బాబు, ప్రతినెల మొదటి తారీఖు జీతం వస్తే చాలు అనే సమాధానాలు మాత్రమే వస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి సమాధానాలు కాకుండా ఐటీ కంపెనీ జీతం భారీగా పెంచిందనే వార్త వస్తే ఎలా ఉంటుంది? ఏకంగా 64 కోట్లు ఇచ్చిందని తెలిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ప్రస్తుతం దీనిని ఇన్ఫోసిస్ ఉద్యోగులు అనుభవిస్తున్నారు. మేఘాల్లో తేలిపోతున్నారు.

భారీగా ప్రకటించేసింది

ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. రేపటి నాడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక ఇబ్బంది పడుతోంది. ఇలాంటి క్రమంలోనే చాలా కంపెనీలు ఖర్చుల్లో కోతలు విధిస్తున్నాయి. ఉద్యోగులకు పింక్ స్లిప్పులు జారీచేస్తున్నాయి. కానీ వీటికి భిన్నంగా ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ 64 కోట్ల రూపాయలను నజరానాగా తన ఉద్యోగులకు ప్రకటించింది. ఈ డబ్బుకు సరిపడా 5,11,862 షేర్లను కేటాయించింది. ఈ మేరకు వివరాలను భారత స్టాక్ ఎక్స్చేంజి మే 12న తెలియజేసింది. ఇన్ఫోసిస్ జారీ చేసిన ప్రకారం 5,11,862 షేర్ల విలువ దాదాపు 64 కోట్లు. ఇక వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇన్ఫోసిస్ కంపెనీ మార్కెట్ వర్గాలకు తెలియజేసింది. 2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద 1,04,335 ఈక్విటీ షేర్లు, ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్ షిప్ ప్రోగ్రాం 2019 కింద 4,07,527 ఈక్విటీ షేర్లు కేటాయించింది. ఈ కేటాయింపు తర్వాత కంపెనీ విస్తరించిన షేర్ కాపిటల్ రూ. 2,074.9 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్స్ ప్రోగ్రాం ద్వారా 2019 కింద పొందిన షేర్లకు సంబంధించి ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు.

ఉద్యోగులు చేజారకుండా ఉండేందుకే..

ప్రస్తుతం ఐటి పరిశ్రమ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అయితే ఇది స్వల్ప కాలం మాత్రమే అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి సమయంలో అడ్డగోలుగా ఉద్యోగులను తొలగిస్తే రేపటి నాడు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని భావించి ఇన్ఫోసిస్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకే ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్ షిప్ ప్రోగ్రాం ను అమల్లో పెట్టింది. దీని ద్వారా ఉద్యోగుల్లో ఉన్న కీలక ప్రతిభను ప్రోత్సహించడం, దానిని తుదికంటా కాపాడుకోవడం, అలాగే ఉద్యోగులను ఆకర్షించడం, కంపెనీలో ఉద్యోగుల యాజమాన్యాన్ని విస్తరించడం.. ద్వారా భవిష్యత్తు లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేవలం కొంతమంది మాత్రమే కాకుండా సంస్థలో పని చేసే అందరి ఉద్యోగులకు ఈ ప్లాన్ వర్తిస్తుందని ఇన్ఫోసిస్ వర్గాలు ప్రకటించాయి. ఇక ఈ ప్లాన్ కింద నిరోధిత స్టాక్ యూనిట్ వెస్టింగ్ వ్యవధి అవార్డు తేదీ నుంచి కనిష్టంగా సంవత్సరం, గరిష్టంగా మూడు సంవత్సరాలు ఉంటుంది. ఉద్యోగిని తొలగించినప్పుడు లేదా రాజీనామా చేసిన సందర్భంగా వెస్టింగ్ ప్రమాణాలు సంతృప్తి చెందకపోతే సంబంధిత అవార్డు ఒప్పందం కింద మంజూరు చేసిన నియంత్రిత స్టాక్ యూనిట్లు రద్దు అవుతాయని కంపెనీ ప్రకటించింది. ఇన్ఫోసిస్ ప్రకటించిన ఈ నిర్ణయంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular