Monsoon Travel Destinations: రెండు రోజులుగా వర్షాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగినట్లే అనుకోవచ్చు. ఇన్ని రోజులు వాతావరణ వేడిగా ఉండడంతో విహార యాత్రలకు వెళ్లేందుకు కొందరికి సాధ్యం కాలేదు. ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో కొన్ని ప్రదేశాలు ఆహ్లదంగా మారుతాయి. ప్రకృతి కొత్త అందాలను సంతరించుకోవడంతో కొండలు పచ్చదనంతో కళకళలాడుతాయి. జలపాతాలు ఉప్పొంగుతాయి. మేఘాలు పర్వతాలను తాకుతూ అద్భుతమైన దృశ్యాలను సృష్టిస్తాయి. అలాంటి సమయంలో ట్రిప్ ప్లాన్ చేస్తే మరపురాని అనుభూతిని పొందవచ్చు. వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన ఐదు అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఇవే.
మున్నార్.. మేఘాలు, టీ తోటల స్వర్గం
కేరళలోని మున్నార్ వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. పచ్చని టీ తోటలు, పొగమంచుతో కప్పుకున్న కొండలు, చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎరావికుళం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, టాప్ స్టేషన్ వంటి ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణలు. వర్షపు చినుకుల్లో టీ తోటల మధ్య నడవడం ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇక్కడికి వెళ్లాలంటే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో మున్నార్ ఉంటుంది. బస్సులు, టాక్సీలు సులభంగా లభిస్తాయి.
కూర్గ్ .. ఇండియన్ స్కాట్లాండ్
కర్ణాటకలోని కూర్గ్ను ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. వర్షాకాలంలో ఇక్కడి కాఫీ తోటలు, జలపాతాలు, అడవులు మరింత సుందరంగా మారుతాయి. అబ్బే ఫాల్స్, రాజాస్ సీట్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్ వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గధామం. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న తరువాత అక్కడి నుంచి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో కూర్గ్ ఉంటుంది. మైసూరు నుంచి కూడా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
లోణావాలా… జలపాతాల అందాల నిలయం:
ముంబై, పుణే నగరాలకు సమీపంలో ఉన్న లోణావాలా వర్షాకాలంలో సందర్శించడానికి అత్యుత్తమ ప్రదేశాల్లో ఒకటి. భారీ జలపాతాలు, పచ్చని లోయలు, మేఘాలతో కప్పబడిన కొండలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. టైగర్ పాయింట్, భూషి డ్యామ్, కార్లా గుహలు తప్పక చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడికి వెళ్లాలంటే ముంబై, పుణే నగరాల నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ముంబై నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
చిరపుంజి.. వర్షాలకు ప్రసిద్ధి చెందిన అద్భుత ప్రాంతం:
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో చిరపుంజి ఒకటి. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ఇక్కడ వర్షాకాలంలో ఇక్కడి జలపాతాలు, గుహలు, పచ్చని లోయలు మరింత అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా లివింగ్ రూట్ బ్రిడ్జ్లు, నోహ్కాలికై ఫాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం. షిల్లాంగ్ విమానాశ్రయం చేరుకున్న తరువాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారు 55 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే చిరపుంజి చేరుకోవచ్చు.
వాలీ ఆఫ్ ఫ్లవర్స్.. పూలతో నిండిన ప్రకృతి అద్భుతం:
హిమాలయ పర్వతాల మధ్య ఉన్న వాలీ ఆఫ్ ఫ్లవర్స్ వర్షాకాలంలో రంగురంగుల పూలతో నిండిపోతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణ. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య సందర్శిస్తే వేల రకాల పూల అందాలను ఆస్వాదించవచ్చు. జాలీ గ్రాంట్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి జోషిమఠ్, గోవింద్ఘాట్ చేరుకుని ట్రెక్కింగ్ ద్వారా వాలీ ఆఫ్ ఫ్లవర్స్కు వెళ్లవచ్చు.
ఇవి గుర్తుంచుకోవాలి..
వర్షాకాలంలో ప్రయాణించే వారు రెయిన్కోట్, వాటర్ప్రూఫ్ షూస్, అదనపు దుస్తులు వెంట తీసుకెళ్లాలి. వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవడం మంచిది. కొండ ప్రాంతాల్లో రోడ్లు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ప్రయాణించాలి. ప్రకృతి తన అందాలను అత్యంత అద్భుతంగా ప్రదర్శించే కాలం వర్షాకాలం. ఈ ఐదు ప్రదేశాల్లో ఏదో ఒకటి సందర్శిస్తే మేఘాలు, జలపాతాలు, పచ్చని ప్రకృతి మధ్య మరపురాని అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

