Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి. అడవులు తగ్గిపోతే.. వాటి ఆధారంగా బతికే పక్షులు కూడా మనుగడ కోల్పోతాయి. చివరికి విలుప్త జాబితాలో చేరిపోతాయి. అందులో ఈ పక్షి కూడా చేరింది. కాకపోతే ఆ పక్షిని కాపాడేందుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. కొందరు మహిళలు నడుం బిగించి ముందుకు వచ్చారు. తద్వారా ఆ పక్షి మనుగడ మొదలైంది. సంతతి పెరిగింది. వారు చేసిన ఆ పని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఫిదా చేసింది.
మనదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అత్యంత కీలకమైన అస్సాం రాష్ట్రంలో హార్గిలా పక్షులు ఒకప్పుడు విపరీతంగా ఉండేవి. వీటి రూపం విచిత్రంగా ఉండేది. అయితే వీటిని అక్కడి ప్రజలు దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. అందువల్ల వీటిని వేటాడేవారు. ఇవి ఎదురుగా వస్తే కీడు జరుగుతుందని భయపడేవారు. ఈ పక్షులు కదంబం చెట్ల మీద ఎక్కువగా ఉండేవి. ఈ పక్షుల సంతతి పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రజలు కదంబం చెట్లను నరికి వేయడం మొదలుపెట్టారు. ఫలితంగా హర్గిలా పక్షుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. వాస్తవానికి ఈ పక్షులు పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. పైగా ఇవి పారిశుద్ధ్య కార్మికుల పాత్ర పోషిస్తూ ఉంటాయి.
చనిపోయిన జంతువుల కళేబరాల మీద ఇవి వాలిపోతూ ఉంటాయి. కళేబరాల మాంసాన్ని తింటుంటాయి. ఈ విధంగా పర్యావరణానికి మేలు చేకూర్చుతాయి. వీటి సంఖ్య తగ్గిపోవడంతో ప్రముఖ జీవ శాస్త్రవేత్త పూర్ణిమ దేవి ఒక ఉద్యమాన్ని అస్సాంలో మొదలుపెట్టారు.. 2007లో ఆమె దీనిని మొదలుపెట్టారు. హర్గిలా సంతతి పక్షులను వేటాడకుండా అస్సాం రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రచారం చేశారు. కొంతమంది మహిళలను ఎంచుకొని హర్గిలా ఆర్మీ ఏర్పాటు చేయించారు. వారికి ఈ పక్షుల గొప్పతనం గురించి వివరించారు. గ్రామస్తులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించారు. అంతేకాదు కదంబం మొక్కలను విరివిగా నాటేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. కాలగర్భంలో కలిసిపోతున్న హర్గిలా సంతతి పెరగడం మొదలైంది. ఇప్పుడు ఆ పక్షులు అక్కడ వేల సంఖ్యకు చేరుకున్నాయి. అంతేకాదు చనిపోయిన జంతువుల కళేబరాలు లేకుండా చేస్తున్నాయి. తద్వారా అస్సాం రాష్ట్రం పరిశుభ్రంగా కనిపిస్తోంది.
పూర్ణిమ దేవి చేసిన సాహసం.. అస్సాం రాష్ట్రంలో హర్గిలా పక్షుల సంతతి పెరగడం వంటి పరిణామాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు. అస్సాంలో ఈ మహిళలు చేసిన పని దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇటువంటి వారి వల్లే ప్రకృతి గొప్పగా ఉంటుందని.. పర్యావరణం సకల జంతువులతో వర్ధిల్లుతూ ఉంటుందని పేర్కొన్నారు..