Hardik Pandya Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఈ జట్టు భవితవ్యం హార్దిక్ పాండ్యా నాయకత్వంలో కూడా మారలేదు. హార్దిక్ పాండ్యా 2024లో జట్టుకు సారథిగా వచ్చాడు. నాటి సీజన్లో ముంబై జట్టు అధమ స్థాయిలో ఉన్న నేపథ్యంలో విపరీతంగా విమర్శలు వచ్చాయి… ఈ నేపథ్యంలో ముంబై జట్టు ఆట తీరు చాలా వరకు మార్చుకుంది.. ఫలితంగా 2025లో నాలుగో స్థానానికి వచ్చింది.
2025లో గొప్పగా ఆడిన ముంబై జట్టు.. 2026లో మాత్రం ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయింది. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. జట్టులో ఆటగాళ్ల ప్రదర్శన ఏ మాత్రం బాగోలేదు. రికెల్టన్ నుంచి మొదలు పెడితే నమన్ వరకు ఉన్నప్పటికీ ఎవరు కూడా సరిగ్గా ప్రదర్శన చేయడం లేదు. బ్యాటింగ్లో విఫలమవుతున్నారు. బౌలింగ్ లోనూ విఫలమవుతున్నారు..
ఇటీవల మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. దీంతో మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చి సూర్య కుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగించారు. అతని ఆధ్వర్యంలో ఒక విజయం సాధించిన ముంబై జట్టు.. కీలకమైన మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. ఇలా కీలకమైన దశలో ఓడిపోవడంతో ముంబై జట్టు ఇంటికి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో ముంబై జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా మీద తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. జట్టులో విభేదాల వల్ల హార్దిక్ పాండ్యా కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అందువల్లే అతడు ఇంస్టాగ్రామ్ లో ముంబై ఇండియన్స్ పేజీని అన్ ఫాలో చేశాడు. మళ్లీ ఫాలో అయ్యాడు. ఇది సాంకేతిక సమస్యా.. ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. లక్నో జట్టుతో.. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లకు హార్దిక్ పాండ్యా ఇప్పటికే దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తొలగించి.. సూర్య కుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ముంబై ఇండియన్స్..మేనేజ్మెంట్ ప్రకటన చేయలేదు.
సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను అందుకోవడానికి సానుకూలంగా ఉన్నాడా.. అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగతంగా ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. అతడి వ్యక్తిగత ఫామ్ కూడా అంత గొప్పగా లేదు. అందువల్ల అతడిని ముంబై మేనేజ్మెంట్ సారధిగా కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావాలంటే ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.