
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్ సైట్ లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ స్పందిస్తూ రాష్ట్రంలో దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని.. నిబంధనలు ఖరారు చేసినట్లు తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ పిటిషన్ లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిణనర్ ను ప్రశ్నించింది. పథకానికి సంబంధించిన జీవో ప్రభుత్వ వెబ్ సైట్ లో లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పింది.