తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకోవడంతో.. దేశాధ్యక్షుడే దేశం విడిచిపారిపోయాడు. ఇక, అక్కడి సామాన్య ప్రజల పరిస్థి వర్ణనాతీతం. దేశం విడిచిపోయేందుకు విమానం రెక్కల మీద ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఏం చేసైనా అఫ్ఘనిస్తాన్ వదిలి పారిపోవాలని ప్రయత్నిస్తున్న జనం.. అందుబాటులో ఉన్న దారులన్నీ వెతుకుతున్నారు. అయితే.. ఒక హిందూ పూజారి మాత్రం తాను ఎక్కడికీ కదిలేది లేదంటున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న విదేశీయులతోపాటు.. ఆ దేశ ప్రజలు కూడా తలదాచుకునేందుకు ఇతర దేశాలకు పారిపోతున్నారు. భారత్, బ్రిటన్ వంటి దేశాలు ఆ దేశ పౌరులను తమ దేశాల్లోకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని తీసుకొచ్చింది. బ్రిటన్ ప్రభుత్వం అసలు వీసానే అవసరం లేదని, విమానం.. రోడ్డు మార్గం ద్వారా ఎలా అవకాశం ఉన్నా.. వచ్చేయండని పిలుపునిచ్చింది. ఈ పిలుపు అందుకున్న వారంతా.. ఆయా దేశాలకు వెళ్లిపోతున్నారు.
అయితే.. ఆ దేశంలోని ఓ హిందూ పూజారి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ను వదిలేది లేదని అంటున్నాడు. ఆ దేశం వీడేందుకు అవకాశం వచ్చినా.. తాను రాలేనని చెప్పారు. ఆయన పేరు రాజేశ్ కుమార్. కాబూల్ లోని రతన్ నాథ్ మందిరంలో ఆయన పూజారిగా పనిచేస్తున్నారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించిన నేపథ్యంలో పలువురు భారతీయులు ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తమ వెంట రావాలని కోరినా.. ఆయన అందుకు అంగీకరించలేదు.
తాను పూజలు చేస్తున్న రతన్ నాథ్ మందిరంలో తన పూర్వీకులు వందల ఏళ్లుగా పూజలు నిర్వహించారని చెప్పాడు. అలాంటి గుడిని వదిలి వచ్చేందుకు తాను సిద్ధంగా లేరని చెప్పా. ఒకవేళ తాలిబన్లు తనను చంపినా.. దాన్ని కూడా సేవగా భావిస్తానంటూ చెప్పుకొచ్చాడు. చాలా మంది హిందువులు తమతో రావాలని కోరినా.. తాను వెళ్లలేదని చెప్పాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.