Ali Khamenei death : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ ఇరాన్కు భారీ దెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది.
శనివారం ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేపట్టాయి. ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఖమేనీ మరణంపై దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు.
ఈ దాడి పక్కా గూఢచారి సమాచారంతోనే జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఖమేనీ తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమై ఉన్న సమయంలోనే దాడి జరిపినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం శిథిలాల నుంచి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేయగా, ఆ తర్వాతే ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు మృతి చెందినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. మరికొందరు గాయపడినట్లు సమాచారం.
ఖమేనీ మరణంతో ఇరాన్లో అధికార ఖాళీ ఏర్పడే అవకాశం ఉండగా, తదుపరి నాయకత్వంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఈ ఘటనకు ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందన్నది ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతీకార దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, ఈ ఘటనతో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ మరింత ఉధృతం అవుతుందా లేక యుద్ధానికి ముగింపు దిశగా సాగుతుందా అన్నది అనిశ్చితంగా మారింది. ఖమేనీ మరణం ప్రాంతీయ శాంతికి దారి తీస్తుందా లేదా మరింత అస్థిరతకు కారణమవుతుందా అన్నది రాబోయే రోజులలో తేలనుంది.