బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త.. కేసీఆర్కు వాయు‘గండం’గా మారింది. ఈ వానలతో మహానగరం కాస్త మహా సముద్రంలా మారింది. డ్రైనేజీ వ్యవస్థలో ఉన్న లోపాలతో సిటీ అంతా ఆగమాగమైంది. ఎక్కడికక్కడ కాలనీలు మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎప్పుడో ఏళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థను మోడ్రనైజేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: పూల సింగిడి.. తెలంగాణలో నేడే పూల పండుగ
ఇప్పుడు ఇదే అంశంపై ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎక్కడికక్కడ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఈ దెబ్బ కూడా సీఎం కేసీఆర్కు బలంగానే తాకినట్లు తెలుస్తోంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పుడు కొత్త సచివాలయ నిర్మాణం తెర మీదకు వచ్చింది. 278 అడుగుల ఎత్తు, ఏడు ఫ్లోర్లు, మొత్తం 200 చాంబర్లతో అత్యాధునికంగా దీన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ఇందుకు 400 నుంచి 500 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే.. ఇంత ఖర్చు పెట్టి పనికిరాని సచివాలయం కట్టడం కంటే, డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయొచ్చు కదా అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
సెక్రటేరియట్ ఇంకొన్నాళ్ల పాటు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ ప్రభుత్వం నేలమట్టం చేయాలనే నిర్ణయం తీసుకుంది. దీనిని ఆ సమయంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు సైతం వ్యతిరేకించాయి. ఈ కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నమూ చేశాయి. అయితే వారు న్యాయస్థానాల్లో చేసిన పోరాటం కూడా ఫలించలేదు. దీంతో కొత్త ప్రాజెక్ట్కు బీజం పడింది. ఇప్పుడు అకాల వర్షాలతో హైదరాబాద్ నీట మునగడంతో.. అందరూ సచివాలయంపై పడ్డారు. కేసీఆర్ సోకుల కోసం వందల కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం కట్టడానికి నిధులు కేటాయిస్తారు కానీ, నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దడానికి ఒక్క రూపాయైనా వెచ్చించారా అని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని బలంగా తీసుకుంటున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ ఇప్పటికే ఎన్నోసార్లు నీట మునిగింది కూడా. గతంలో హైదరాబాద్ను నిర్లక్ష్యం చేశారనుకుందాం.. తొలి దఫా విజయవంతంగా ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుని, రెండో దఫా గద్దెనెక్కిన కేసీఆర్ సర్కారు మాత్రం ఏపాటి చర్యలు తీసుకుంది. అసలు కేసీఆర్ అర్జంట్గా నిర్మించాల్సింది కొత్త సచివాలయాన్నా? సరికొత్త డ్రైనేజీ వ్యవస్థనా? ఇలా తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
Also Read: ధరణి: ఆస్తుల సర్వే ఎంత వరకు కరెక్ట్..?
హైదరాబాద్ మహానగరం. దీని ఇమేజీ విశ్వవ్యాపితం. అందుకే.. రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. వాటికితోడు ఆక్రమణలూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా క్షేత్రస్థాయిలో కనిపించే నిజం. ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, చోటా మోటా నాయకులు జేబులు నింపుకోడానికి అడ్డదిడ్డంగా పర్మిషన్లు ఇప్పించి, అధికారులను ఒప్పించి మరీ ఇలాంటి తప్పుడు పనులు చేయించారు. అర్జంట్గా కేసీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే.. మరికొద్ది రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఎదురుదెబ్బ తగలక మానదు. గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక విధంగా కఠినతరమైన టాస్క్ అనే చెప్పవచ్చు.