దేశవ్యాప్తంగా కరోనా రక్కసి వ్యాప్తి చెందుతున్నప్పటికీ దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల కంటే జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా కనిపిస్తోంది. మొత్తం 734 జిల్లాలకు గాను ఇంతవరకు 350 జిల్లాల్లో సున్నా కేసులు నమోదుకావడం ఒకింత ఊరటనిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఏడు జిల్లాల్లో కరోనా జాడ లేకపోవడం కూడా ఒకింత శుభపరిణమమే. ఆంధ్రప్రదేశ్ లో రెండు జిల్లాల్లో (విజయనగరం, శ్రీకాకుళం) ఇంతవరకూ కేసులు లేవు. మిగిలినవాటిలో అత్యధికంగా గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఐదు జిల్లాల్లో (వరంగల్ గ్రామీణ, వనపర్తి, మంచిర్యాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి) కేసుల్లేవు. అత్యధిక కేసులు హైదరాబాద్ పరిధిలోనే కనిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా 70కి పైగా జిల్లాల్లో కేవలం ఒకేఒక్క కేసు నమోదైంది. 148 జిల్లాల పరిధిలో 10కి మించి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనేక పెద్ద నగరాల్లోనూ కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. సిక్కిం, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలిలలో ఒక్క కేసూ నమోదు కాలేదు. కోల్కతా, బెంగుళూరుల్లో మాత్రం కరోనా వ్యాప్తి పరిమితంగా ఉంది.
మణిపూర్, త్రిపురల్లో రెండు కేసులు, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.