Pawan Kalyan- YCP: వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాజకీయంగా దూకుడు పెంచిన జనసేన అధినేత పవన్పై కొన్నాళ్లుగా కక్షసాధింపు చర్యలకు దిగిన ఏపీలోని వైసీపీ సర్కార్ కొన్ని రోజులుగా దూకుడు తగ్గించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూ మధ్య మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని పవన్ ప్రకటించగానే జగన్ కోపం రెట్టింపైంది. అంతే ఇక తాను పాల్గొనే ప్రతీ సభలోనూ, కార్యక్రమంలోనూ చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టేశారు జగన్. ఆయన్ను చూసి వైసీపీ నేతలు కూడా పవన్పై విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా కాపు నాడు భేటీ, రంగా వర్ధంతి నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా వెనక్కితగ్గినట్లు కనిపిస్తోంది.

పవన్పై జగన్ విమర్శలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గత ఏడాది కాలంలో దూకుడు మరింత పెంచారు. ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభ నుంచి మొదలుపెట్టి వైసీపీపై పవన్ తన దాడి ముమ్మరం చేశారు. దీంతోపాటు మళ్లీ చంద్రబాబువైపు మొగ్గడం మొదలుపెట్టారు. దీంతో సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలు కూడా సందర్భంతో సంబంధం లేకుండా పవన్ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ వర్సెస్ చంద్రబాబు కంటే జగన్ వర్సెస్ పవన్ వారే ఎక్కువయ్యేలా ఉందన్న చర్చ కూడా జరిగింది.
తగ్గిన వైసీపీ దూకుడు?
అయితే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేసిన వైసీపీ, ప్రధాని పర్యటనలో పవన్కు దక్కిన ప్రాధాన్యత, రాష్ట్రంలో మారుతున్న రాజకీయం నేపథ్యంలో దూకుడు తగ్గించింది. పవన్పై నిత్యం ఏదో ఒక విషయంలో విమర్శలకు దిగే పేర్నినాని, కొడాలి, అమర్నాథ్ వంటి నేతలు కూడా కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. మధ్యలో వారాహి వాహనంపై విమర్శలు చేసినా త్వరగానే వాటి నుంచి వెనక్కితగ్గారు. సీఎం జగన్ కూడా సభల్లో పవన్ పై తీవ్ర విమర్శలు చేయడం లేదు. దీనంతటికీ ఓ కీలక కారణం కనిపిస్తోంది.

కాపు రాజకీయంతో వ్యూహాత్మక మౌనం?
రాష్ట్రంలో ప్రస్తుతం కాపు రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ ఇద్దరూ కాపు నేత వంగవీటి రంగాను స్మరించుకుంటున్నారు. ఆయన కుమారుడు రాధా ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం క్లారిటీతో కాపు రిజర్వేషన్ల అంశం కూడా తెరపైకి వస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ను వైసీపీ కానీ, జగన్ కానీ టార్గెట్ చేస్తే సహజంగానే ఈ వ్యతిరేకత వైసీపీపైకి మళ్లే అవకాశాలు లేకపోలేదు. అలాగే జగన్కు వ్యతిరేకంగా పవన్ చేస్తున్న రాజకీయంతో సహజంగానే కాపులు సీఎం పదవి డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో జరిగే కాపునాడు భేటీలోనూ ఇదే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు కాపులకు ఆశాదీపంగా కనిపిస్తున్న పవన్పై విమర్శలకు దిగితే ఆ ప్రభావం కచ్చితంగా అధికార పార్టీపై పడటం ఖాయం. అందుకే వైసీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.