నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. టార్గెట్ చేస్తూ మాట్లాడడం.. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తూ కాంట్రవర్సీ నటిగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్కు కేంద్రం హోం మంత్రిత్వ శాఖ వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినట్లు సమాచారం. ఫస్ట్ నుంచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే కాకుండా ఇటీవల సుశాంత్ సూసైడ్పైనా కామెంట్లు చేసింది. ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తూ మరోసారి చర్చకు తెరలేపింది.
బాలీవుడ్లో నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కడి సెలబ్రెటీలు చాలామంది అభ్యంతరం తెలిపారు. దీపికా పదుకొణెపై చేసిన ట్వీట్స్ వివాదానికి తెరలేపాయి. బాలీవుడ్ అంతా ఒకవైపు వెళ్తుంటే.. కంగనా మాత్రం మరోవైపు వెళ్తోందనే వాదనా ఉంది. ఇటీవల.. ముంబై నగరంపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్ను తలపిస్తోందంటూ సంచలనమైన కామెంట్ చేసింది. దీనిపై అధికార శివసేన సీరియస్ అయింది. మహారాష్ట్ర, ముంబై, మరాఠాల గురించి మితిమీరి మాట్లాడితే ఖబడ్దార్ అని, కంగనా చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ కూడా చేశారు. దీనికితోడు ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని కూడా చెప్పడంతో ఆయన మరోసారి కౌంటర్ ఇచ్చారు. ముంబై పోలీసులపై నమ్మకం లేనప్పుడు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావ్. ఇక్కడ అడుగు పెట్టవద్దని సూచించారు.