అధికారం చేతిలో ఉంది. ఆదాయమూ ఉంది. ఈ క్లిష్టమైన కరోనా టైంలో తెలంగాణలో అగ్రశ్రేణి ప్రధాన పత్రికలను చావు దెబ్బ తీసేందుకు తెలంగాణ అధికార పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణ’ రెడీ అవుతోంది. కరోనా-లాక్డౌన్ తో కుదేలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను ప్రధానంగా నమస్తే టార్గెట్ చేస్తోంది. జీతాలు కూడా చెల్లించలేక జర్నలిస్టులను ఇంటికి పంపిన ఆంధ్రజ్యోతి, ఈనాడులకు ఇప్పుడు నమస్తే విసురుతున్న సవాల్ ను తట్టుకుంటాయా? నిలబడుతాయా? అన్నది ఆసక్తి రేపుతోంది.
*నమస్తే విసిరే సవాల్ ఇదే..
తెలంగాణ అధికార పార్టీ ఇప్పుడు కరోనా-లాక్ డౌన్ తో అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఇన్నాళ్లు తెలంగాణలో ‘ఈనాడు’ పత్రిక నంబర్1 పొజిషన్ లో ఉండేది.ఆ తర్వాత సాక్షి, జ్యోతి, నమస్తే ఇలా వరుసగా ఉండేవి. నమస్తే సర్క్యూలేషన్ బాగానే ఉన్నా పాఠకాదరణలో అంతంతే.. అందుకే ఇప్పుడు కుదేలైన ఈనాడు, జ్యోతి సర్క్యూలేషన్ ను అందిపుచ్చుకునేందుకు నమస్తే తెలంగాణ రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే లాక్ డౌన్ ముగిసే మే 17 తర్వాత అంటే మే 18వ తేదీనుంచి జిల్లా టాబ్లాయిడ్ ను తెచ్చేందుకు ఆ సంస్థ రెడీ అవుతోంది. ఈ మేరకు ముద్రణా సామగ్రిని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం.
*ట్లాబ్లాయిడ్స్ బంద్ అయ్యి 50రోజులు
లాక్డౌన్ ప్రకటించగానే ఈనాడు, జ్యోతి, సాక్షి, నమస్తేలు కూడబలుక్కొని ఖర్చులు తగ్గించుకునేందుకు అందరూ జిల్లా ట్లాబ్లాయిడ్స్ ను ఎత్తివేశాయి. ప్రస్తుతం జిల్లా వార్తలను మెయిన్ లోనే ఇస్తున్నాయి. ప్రింటింగ్ పేపర్ అయిపోవడం..కరోనాతో సర్క్యూలేషన్ తగ్గడం.. ప్రకటనల ఆదాయం లేకపోవడంతో ఇలా జిల్లా సంచికలను ఎత్తివేశాయి. ఈనాడు,జ్యోతిలలోనైతే జర్నలిస్టులను పక్కనపెట్టాయి. జీతాల్లో కోతలు పెట్టాయి. మళ్లీ పుంజుకుంటేనే తీసుకుంటామని తెలిపి వారిని ఇంట్లో కూర్చుండబెట్టాయి. నష్టాల్లో ఉన్న ఈనాడు ఏకంగా చరిత్రలో తొలిసారి 1వ తారీఖుకు బదులు 10వ తేదీన జీతాలు చెల్లించింది. జ్యోతి ఉన్నవాళ్లకు 75శాతమే జీతాలిచ్చింది. ఇప్పుడు దుర్భర దారిద్ర్య పరిస్థితుల్లో ఈ సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా ఉంది..
*క్యాష్ చేసుకుంటున్న ‘నమస్తే’
ఈనాడు, జ్యోతి పత్రికలు ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవు.అవి ట్లాబ్లాయిడ్స్ ను తీసే యోచనలో లేవు. మెయిన్ లోనే కలిపికొడుతాయి. అయితే నమస్తే తెలంగాణ సర్క్యూలేషన్ పెంచుకోవడానికి ఇదే మంచి అదును అని భావిస్తోందట.. వేరే పత్రికలు ఆర్థికంగా కుదేలైన వేళ ట్లాబ్లాయిడ్స్ ను తీయలేవు కాబట్టి నమస్తే తెలంగాణ జిల్లా టాబ్లాయిడ్స్ ను తీయడానికి రెడీ అయ్యింది. టాబ్లాయిడ్స్ తీసుకొచ్చి జనంలోకి విస్తృతంగా వెళితే ఈనాడు,జ్యోతి సర్క్యూలేషన్ ను సంపాదించుకోవచ్చని ప్లాన్ చేస్తోంది.
*ఈనాడు, జ్యోతికే దెబ్బ
నమస్తే తెలంగాణ ఈనెల 18 నుంచి టాబ్లాయిడ్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. అయితే దీంతోపాటు పోటీగా సాక్షి కూడా తేవడం ఖాయమే. ఎందుకంటే ఇంత కరోనా టైంలో ఈనాడు,జ్యోతిలు జీతాలు కట్ చేసి జర్నలిస్టులను ఇంటికి పంపినా.. సాక్షి మాత్రం ఒక్కరిని తీసివేయలేదు. జీతాలు కట్ చేయలేదు. ఏపీలో అధికారంలో ఉండడంతో మేనేజ్ చేసింది. దీంతో నమస్తే విసురుతున్న చాలెంజ్ ను సాక్షి తట్టుకొని టాబ్లాయిడ్స్ తేస్తుంది. ఇక నమస్తే దెబ్బకు కుదేలయ్యేది ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమే. తెలంగాణలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న ఈనాడు పత్రిక ఖచ్చితంగా తన ప్రథమ స్థానాన్ని కోల్పోకూడదనుకుంటే జిల్లా టాబ్లాయిడ్స్ ను తీసుకొస్తుంది. తీసుకురాకపోతే ఇక ఆ పత్రికకు పెద్ద దెబ్బే. ఇక ఆంధ్రజ్యోతి ఈ కష్టకాలంలో అంత ఆర్థిక భారాన్ని మోస్తుందా లేదా అన్నది చెప్పడం కష్టమే.. మొత్తంగా నమస్తే తెలంగాణ విసురుతున్న చాలెంజ్ కు ప్రధాన పత్రికలు కుదేలవ్వడం ఖాయమని జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Will eenadu sakshi and andhra jyothi accept namasthe telangana challenge
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com