CM KCR: బీఆర్ఎస్ బాస్.. తెలంగాణ ఉద్యమ సారథి.. భారత రాష్ట్ర సమితి, అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి.. పక్కా హిందూ వాది. సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ముహూర్తం చూసుకోకుండా కాలు కూడా బయట పెట్టరు. అంతటి సెంటిమెంట్ ఉన్న నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఆధ్యాత్మికతతోపాటే.. కొన్ని సెంటిమెంట్లనూ కేసీఆర్ ఫాలో అవుతారు. సాధారణంగా రాజకీయ నేతలకు కొన్ని విషయాల్లో సెంటిమెంట్లు ఉంటాయి. అయితే అది కేసీఆర్కు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక ఎన్నికల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని హుస్నాబాద్ నుంచి ప్రారంభించి అధికారంలోకి వచ్చారు. దీంతో ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి సమరశంఖం పూరించాలని నిర్ణయించారు.
వరుస విజయాలతో సెంటిమెంట్గా..
సీఎం కేసీఆర్ కు హుస్నాబాద్ సెంటిమెంట్గా మారిపోయింది. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. ఇందులో భాగంగానే.. అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయాలని ముహూర్తం పెట్టుకున్నారు.
కలిసొచ్చిన రెండు ఎన్నికలు..
2014, 2018 ఎన్నికల్లో హుస్నాబాద్లో మొదలు పెట్టిన ప్రచారం నాటి టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. వరుసగా 63, 88 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈసారి పార్టీ పేరు మారింది. టీ పోయి బి వచ్చింది. అయినా కేసీఆర్ మాత్రం ఈసారి కూడా హుస్నాబాద్ సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరి పేరుమారిన పార్టీకి ఈసారి కూడా సెంటి మెంటు గెలిపిస్తుందా లేదా అన్నది చూడాలి.
షెడ్యూల్ ఇలా..
అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన ఉంటుంది. అక్టోబర్ 15న హైదరాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు పాల్గొంటారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తారు.