
Jagan Emergency Meeting: మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు రాను రాను వైసీపీ మెడకు చుట్టుకుంటోంది. దాంతో ఆ పార్టీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు. స్వచ్చీలతను నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రతిపక్షాల వేళ్లన్నీ ముఖ్యమంత్రి జగన్ వైపే చూపుతున్నాయి. అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ ముఖ్య నేతలతో తాడేపల్లిలో సమావేశమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు, కోర్టు ముందు హాజరుపరచగా, 10 రోజలు రిమాండ్ విధించారు. విచారణకు ఆయన మొదటి నుంచి సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉన్నందున ఆయనను కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరిన మేరకు కోర్టు రిమాండ్ కు అనుమంతించింది. ఓ వైపు భాస్కర్ రెడ్డి విచారణ జరుగుతుండగానే, సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అవినాష్ రెడ్డి సీబీఐ ఇప్పటికీ ఐదుసార్లు నోటీసులిచ్చింది. ఆయన అరెస్టు తప్పదనే పుకార్లు వినిపిస్తున్నాయి.
కాగా, ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసేశారు. అనంతపురంలో వసతి దీవెన కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. దానిని మరో రోజుకు మార్పు చేశారు. విజయవాడలో ప్రభుత్వం తరుపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దానికీ ఆయన హాజరుకావడం లేదు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా, తదితర ఎమ్మెల్యేలతో కార్యక్రమాన్ని ముగించనున్నారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపై ఎలా ముందుకెళ్లాలని చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. పార్టీ తరుపున ఎలా ముందుకెళ్లాలి? ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి? ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలని అన్న అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది.
కాగా, హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి బయల్దేరారు. ఆయన వెంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. వివేకా హత్య కేసు విషయంలో సీఎం జగన్ చర్చించిన అంశాలను అవినాష్ రెడ్డికి చెవిరెడ్డి వివరించనున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హై కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.