Homeజాతీయ వార్తలువిజయశాంతి బరిలోకి దిగుతుందా..?

విజయశాంతి బరిలోకి దిగుతుందా..?

Vijayashanti
బిహార్‌‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 65 స్థానాలను ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. ఈ మధ్య అనారోగ్యంతో చనిపోయిన సొలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక నియోజకవర్గానికీ ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఈ ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి ఉప ఎన్నికల్లో తమదే విజయమని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే శాసనసభ పక్ష సమావేశంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని స్పష్టం చేశారు. రామలింగారెడ్డి కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని దాదాపు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో అయినా టీఆర్‌ఎస్‌ పార్టీనే తన సత్తాచాటుతూ వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నిక మీద కూడా అంతే ధీమాతో ఉంది. గెలుపు పెద్ద కష్టమేమీ కాదన్నట్లుగా లైట్‌గా తీసుకుంటోంది. మరోవైపు బీజేపీ తరఫున రఘునందన్‌రావు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఇంకా ఖరారు చేయనప్పటికీ తనకే టికెట్‌ గ్యారంటీ అన్న ధోరణితో ముందుకు సాగుతున్నారు. అయితే.. ఇప్పటికే రెండుసార్లు రఘునందన్‌రావుకు ఛాన్స్‌ ఇచ్చామని, మరోసారి ఎందుకని బీజేపీలోనూ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నట్లు సమాచారం.

ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజవకర్గ నేతలతో అక్కడి పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా విజయశాంతి పేరు పరిశీలనలోకి వచ్చిందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. విజయశాంతి అంగీకరిస్తే దుబ్బాకలో రంగంలోకి దింపాలన్న యోచనలో ఉన్నారట. విజయశాంతి గతంలో మెదక్ జిల్లా నుంచే పోటీ చేయడంతో ఆమెకు ప్రియారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయశాంతి పోటీకి దిగుతారా..? అంటే ఆ అవకాశాలు తక్కువే అన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రావణ్‌ కుమార్‌‌ కూడా మరోసారి టికెట్‌ అడుగుతున్నారట. దీంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఎలాగైనా గట్టి పోటీ ఇచ్చే బలమైన అభ్యర్థిని దింపాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే చేయించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొత్తం మీద విజయశాంతి అంగీకరిస్తే దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని గాంధీ భవన్ వర్గాలూ చెబుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular