Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ దాడికి కారణమేంటి?

Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ దాడికి కారణమేంటి?

Vijayasai Reddy: ఒకరేమో జగన్ కు వీర విధేయుడు. ఆయన గీసిన గీటు దాటడు. ఆయనతో పాటే జైలు జీవితం గడిపాడు. మరొకరు జనసేనాని పవన్ కళ్యాణ్ కు భక్తుడు. మనసు నిండా గుడు కట్టుకొని, నిద్రలేచి అడిగినా తన ధైవమని చెబుతాడు. పవన్ పై ఈగ వాలనివ్వడు. అటువంటి భిన్న వ్యక్తుల మధ్య మాటల తూటాలు పేలితే.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు కదా. ఆ ఇద్దరు వ్యక్తులు ఎంపీ విజయసాయిరెడ్డి, నిర్మాత, నటుడు బండ్ల గణేష్. గత రెండు రోజులుగా ట్విట్టర్ వేదికగా కాక పుట్టిస్తున్నారు. హాట్ హాట్ కామెంట్లతో దీటైన ప్రశ్నలు, సమాధానాలతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. తనకు సరితూగే వ్యక్తులతో తలపడే విజయసాయిరెడ్డి అనూహ్యంగా బండ్ల గణేష్ కు దొరికిపోయారు. ఎప్పుడూ ఎదుటి వారిని తన మాటలతో ఇరుకున పెట్టే విజయసాయి విలవిల్లాడిపోతున్నారు.

Vijayasai Reddy
Vijayasai Reddy, bandla ganesh

bandla ganesh

తొలుత బండ్ల గణేషే ఈ ట్విట్టర్ యుద్ధానికి తెరలేపారు. బండ్ల గణేష్‌కు ఏపీ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదన్నది ప్రాథమిక అంశం. తనకు జగన్ మోహన్ రెడ్డి అంటే ఇష్టమే కానీ.. విజయసాయి రెడ్డిని కాదని ఎత్తిచూపారు కూడా. మరి వీరి మధ్య వివాదానికి అసలు కారణం ఏంటన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. జగన్ కేబినెట్‌లోని ఓ మంత్రితో తనకు స్నేహం ఉందని బండ్ల గణేష్ ఇదివరకే చెప్పుకొచ్చారు. ఆయన బొత్స సత్యనారాయణ అని అందరికీ తెలిసిన సంగతే. ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయి ఉండడంతో సీనియర్ అయిన బొత్స జీర్ణించుకోవడం లేదు. తన ఆధిపత్యానికి విజయసాయి గండికొడుతున్నాడని బొత్స ఉడికిపోతున్నాడు. బొత్స, విజయసాయి మధ్య పరిస్థితులు స్నేహపూర్వకంగా లేవు. బొత్స విజయనగరానికే పరిమితమయ్యారు. మంత్రిగా ఆధిపత్యం చెలాయించలేకపోతున్నారు. విశాఖను మొత్తం విజయసాయి చూసుకుంటున్నారు. ఇక ఇటీవల కీలక శాఖ నిర్వహించిన బొత్స తాజాగా కేబినెట్ విస్తరణలో అసలు ఆదాయం లేని విద్యాశాఖగా మారడం కూడా బొత్స మద్దతుదారులకు మింగుడుపడటం లేదన్న టాక్ నడుస్తోంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బండ్ల గణేష్ తో ఈ మాటల దాడి చేయించారని.. విజయసాయిని టార్గెట్ చేశారని ప్రచారం సాగుతోంది.

కమ్మలపై దౌర్జన్యానికి విజయసాయి పాల్పడ్డారంటూ పరోక్షంగా దాడి చేశారని అంటున్నారు.

రాజకీయంగా, పారిశ్రామికంగా తమకు పట్టున్న అవకాశాలను అడ్డుకోవడంతో విశాఖలోని కమ్మ వర్గీయులు విజయసాయిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను ఈ ప్రాంతానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నారు కానీ అది జరగడం లేదు. విజయసాయి అధికారంలో ఉన్నంత కాలం బొత్సను గానీ, ఎవరినీ ఈ ప్రాంతంలో అధికారం చేజిక్కించుకోనివ్వరు. అందుకే చివరకు బండ్ల గణేష్ ను రంగంలోకి దించారని.. కమ్మ తన వర్గమంటూ బండ్ల రెచ్చిపోవడానికి కారణం ఇదేనంటున్నారు.

ఇక బొత్సకు , బండ్ల గణేష్ కు సన్నిహిత సంబంధాలున్నాయి.బండ్ల సినీ నిర్మాతగా మారడానికి బొత్స పెట్టుబడులే కారణమని.. బొత్స డబ్బులతోనే బండ్ల నిర్మాతగా ఎదిగాడన్నది ఇన్ సైడ్ టాక్. ఈ క్రమంలోనే బండ్లను ఇలా విజయసాయిరెడ్డిపై ఫైటింగ్ కు ఉపయోగించుకున్నారా? అన్న టాక్ నడుస్తోంది.

ఇక మరో టాక్ కూడా వినిపిస్తోంది. ట్విట్టర్ పోస్టులను చూస్తే మాత్రం విశాఖలో భూ వివాదమే కారణమని తేటతెల్లం అవుతోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. విశాఖ వ్యవహారాలను సైతం చూస్తున్నారు. ఆయన చుట్టూ భూ వివాదాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. సొంత పార్టీ నాయకులు సైతం సీఎంవోకు ఫిర్యాదులిస్తున్నారు. విశాఖలో భూ మాఫియా వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సేమ్ మీనింగ్ వచ్చేలా విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. సాధారణంగా తన స్థాయి వ్యక్తులను చూసే విజయసాయి స్పందించే వారు. కొన్ని సార్లు ఫక్తు వైసీపీ కార్యకర్తలా కూడా వ్యవహరించిన సందర్భాలున్నాయి. బండ్ల గణేష్ ప్రశ్నించేసరికి.. నమూషీగా ఫీలయిన విజయసాయి తన భాషలో రిప్లయ్ ఇచ్చారు. పక్కలు.. వక్కలు అంటూ తన ట్రేడ్ మార్క్ లాంగ్వేజ్‌తో విమర్శలు గుప్పించడంతో ఇక బండ్ల గణేష్ ఊరుకుంటారా. ఆయన కూడా ప్రారంభించారు. విజయసాయిరెడ్డిని ఆయన భాషలోనే విమర్శించడం ప్రారంభించారు. విజయసాయిరెడ్డి, బండ్ల గణేష్ మధ్య ప్రారంభమైన ఈ ట్విట్టర్ రచ్చ శనివారం సాయంత్రం వరకూ సాగుతూనే ఉంది. ఓ ట్వీట్ బండ్ల గణేష్ చేస్తే.. దానికి సమాధానంగా విజయసాయిరెడ్డి చేస్తారు. దానికి మళ్లీ గణేష్ కౌంటర్ ఇస్తారు ఇలా వరుసగా ఇద్దరి ట్విట్టర్ అకౌంట్లలో పెద్ద ఎత్తున ట్వీట్లు ఉన్నాయి.

Vijayasai Reddy, bandla ganesh
Vijayasai Reddy, bandla ganesh

-నెల్లూరి పెద్దారెడ్డి చుట్టూ వివాదాలు

ఈ మొత్తం ఎపిసోడ్ లో మాత్రం విజయసాయిరెడ్డి ఇమేజ్ కు భారీగా డ్యామేజ్ అయ్యింది. విశాఖ భూ మాఫియా వెనుక విజయసాయిఃరెడ్డి హస్తం ఉన్నది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దిరోజుల నుంచి ఇదే టాక్ నడుస్తున్నా.. దానిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా బండ్ల గణేష్ ట్విట్టర్ అస్త్రాలు ఆయుధంలా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే తాను అనుకున్నది సాధించడంలో బండ్ల గణేష్ సక్సెస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయి రెడ్డి విశాఖ నగరంలో పాతుకుపోవాలని తహతహలాడారు. ఇప్పటికే నెల్లూరి పెద్దా రెడ్డి సుబ్బిరామిరెడ్డి దశాబ్దాల పాటు విశాఖ నగరాన్ని ఏలారు. తన మార్కు రాజకీయాన్ని చూపించారు. అదే బాటలో నడవాలనుకున్నారు విజయసాయి రెడ్డి. అందుకు ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ బాధ్యతలు కూడా ఉపయోగపడ్డాయి. మరోవైపు పాలనా రాజధానిగా విశాఖ ప్రకటన కూడా కలిసి వచ్చింది. అయితే ఇదే అదునుగా భూ వ్యవహారాల్లో వందల కోట్ల రూపాయలను విజయసాయిరెడ్డి వెనుకేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు, అన్నిరంగాల ప్రముఖులు ఆయన భూ బాధితులుగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ విశాఖను ప్రస్తావిస్తూ ఆరోపణులు చేయడం.. ఎక్కడైనా ఇద్దరి మధ్య భూ వివాదం నెలకొందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

-గణేష్ తో ఎందుకు పెట్టకోవడం?

వాస్తవానికి బండ్ల గణేష్ ఒక ఫైర్ బ్రాండ్. సభలు, సమావేశాలు, చివరకు ప్రెస్ మీట్లు, టీవీ చర్చల్లోనైనా కుండబద్దలు కొట్టి మాట్లాడతారు. అటువంటి వ్యక్తితో వాదన పెట్టుకోవడం ఏమిటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఎక్కువ బ్యాడ్ అయిపోతున్నారని అధికార పార్టీ అభిమానులు మదనపడుతున్నారు. బండ్ల గణేష్‌తో వాదన పెట్టుకోవడం ఏమిటని..ఆయనతో అన్నన్ని మాటల పడాల్సిన అవసరం ఏమిటని వైసీపీ నేతలు కూడా గింజుకుంటున్నారు. ప్రతీ దానికి చంద్రబాబును తీసుకొచ్చే విజయసాయిరెడ్డి ఇందులోనూ అసువుగా చంద్రబాబు పేరు వాడేశారు. బండ్ల గణేష్‌ బాస్ చంద్రబాబు అనేశారు. దీంతో బండ్ల గణేష్ మరోసారి విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డిని దారుణంగా తిట్టారు. తన బాస్ పవన్ కల్యాణ్ అన్నారు. వీరి మధ్య ట్విట్టర్ యుద్ధాన్ని మీడియా చానళ్లు హైప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బండ్ల గణేష్ ను చర్చలకు పిలిచి విజయసాయిరెడ్డిపై కెలుకుతున్నాయి.

మొత్తంగా విశాఖలో విజయసాయి పెత్తనమే ఈ రచ్చకు కారణమని.. ఆయన్ను సహించలేకనే బండ్లను కొందరు రంగంలోకి దిగారని అంటున్నారు.

1 COMMENT

  1. […] Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav: రాజకీయ పార్టీలు అన్న తర్వాత వర్గ విభేదాలు చాలా కామన్. ఇక అధికార పార్టీ అయితే ఆ విభేదాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. మొన్నటి వరకు లోగుట్టుగా కొనసాగిన వైసీపీలోని వర్గ విభేదాలు.. కొత్త కేబినెట్ కారణంగా ఒక్కసారిగా బయట పడుతున్నాయి. 11 మందిని ఉంచి.. తమను తీసివేయడంతో మాజీ మంత్రులంతా గరం మీద ఉన్నారు. పైగా తమ స్థానంలో తమ జిల్లాకే చెందిన ప్రత్యర్థి వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం మరింత కాక రేపుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ తరహా విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular