
మరో రెండు రోజుల్లో ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని వీడబోతున్నారు. ఎన్నో వివాదాలు.. మరెన్నో వివాదస్పద నిర్ణయాలతో ఆయన చివరికి పీఠాన్ని వదలబోతున్నారు. అయితే.. పోతూపోతూ కూడా మరోసారి చైనాకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారట. ట్రంప్ పదవిలో ఉన్నన్ని రోజులు చైనాకు చుక్కలు చూపించారు. డ్రాగన్తో కయ్యానికి కాలుదువ్వారు. అయితే.. చివరి రోజుల్లోనూ ఆ దేశాన్ని వదిలిపెట్టడం లేదు.
Also Read: చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. పెరుగుతున్న కేసులు..?
ఆర్థికంగా చైనాను బలహీనపరిచేందుకు ఉన్న అన్ని అస్త్రాలనూ సంధిస్తున్నారు. తాజాగా చైనా టెలికాం దిగ్గజం, 5జీ సాంకేతికతకు ప్రసిద్ధి గాంచిన హువావే టెక్నాలజీస్పై విరుచుకుపడ్డారు. అమెరికాలోని ఇంటెల్ సహా మరికొన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హువావేకు పరికరాలను సరఫరా చేస్తున్నాయి. ఈ అనుమతుల్ని రద్దు చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.
Also Read: అమెరికాలో ఎమర్జెన్సీ.. ట్రంప్ సంచలన నిర్ణయం
ఈ ఎగుమతుల కోసం చైనా కొత్తగా చేసుకున్న దరఖాస్తులను కూడా తిరస్కరించే యోచనలో ఉన్నారు. దాదాపు 150 అనుమతులను ట్రంప్ రద్దు చేయనున్నట్లు సమాచారం. వీటి విలువ దాదాపు 120 బిలియన్ డాలర్లు. మరోవైపు అదనంగా 280 బిలియన్ డాలర్ల ఒప్పందాలకు చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో అవన్నీ నిలిచిపోయే అవకాశం ఉంది. హువావేకు అమెరికా నుంచి ఎలాంటి పరికరాలు వెళ్లకూడదని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా కంపెనీలకు వాణిజ్య శాఖ నోటీసులు జారీ చేసింది. ట్రంప్ నిర్ణయంపై 20 రోజుల్లోగా స్పందించాలని తెలిపింది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
5జీ సాంకేతికతను సమకూర్చే అంశంలో హువావే ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ట్రంప్ మాత్రం దాని ఆశలకు అడ్డుకట్ట వేస్తున్నారు. చైనా సాంకేతికత వల్ల సమాచారం దోపిడీకి గురవుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హువావేను బహిష్కరించాలని పాశ్చాత్య దేశాలను సైతం ఆయన కోరారు. దీంతో హువావేతో ఉన్న ఒప్పందాన్ని యూకే రద్దు చేసుకుంది. మొత్తంగా ట్రంప్ దిగిపోతూ కూడా తన మార్క్ను మరోసారి చాటాలని చూస్తున్నారు. అదే క్రమంలో చైనాకు నిద్రలేకుండా చేసిపోవాలని నిర్ణయానికి రావడం కొసమెరుపు.