మరి కొద్ది రోజుల్లో తిరుపతి ఎంపీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికల జరగనుంది. తిరుపతి సీటు సిట్టింగ్ వైసీపీదే కావడంతో ఆ పార్టీ చాలెంజ్గా తీసుకుంది. అక్కడి ఎంపీ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. రిజర్వుడు క్యాటగిరి ఎంపీ స్థానం అయిన ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇదివరకే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. అధికార పార్టీ సిట్టింగ్ సీట్ కావడంతోపాటు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి బలమైన నేతలు ఉండడంతో వైఎస్సార్సీపీకి ఇక్కడ కాస్త అనుకూలత ఉంది. ఇక బీజేపీ–జనసేన కూటమి తరపున బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు అటు బీజేపీ ఇటు జనసేన అధికారికంగా ప్రకటించాయి.
Also Read: 400 గ్రాముల గంజాయి,120 ఫుల్ బాటిల్స్.. రేవ్ పార్టీలో విస్తుపోయే విషయాలు
చాలా కాలంగా సోము వీర్రాజు సహా అనేకమంది బీజేపీ నేతలు తాము జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని సవాల్ విసురుతున్నారు. అయితే.. నిజంగా తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగిన తీరులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదుగుతారా లేక చరిత్రను పునరావృతం చేస్తూ నోటాతో పోటీ పడతారా అన్నది తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలతో తేలిపోనుంది. అయితే.. ఇటీవలి కాలంలో సోషల్ ఇంజనీరింగ్లో రాటుతేలిన సునీల్ దియోధర్ వంటి బీజేపీ నేతలు కొద్ది నెలలుగా తిరుపతిలో మకాం వేసి బూత్ లెవెల్ రిపోర్టులను తెప్పించుకుని మరీ కష్టపడుతున్నారు అన్న వార్తల నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ భవితవ్యాన్ని నిర్దేశిస్తుండే పరీక్షలా మారింది అని చెప్పడంలో సందేహం లేదు.
రాష్ట్ర బీజేపీ నాయకత్వం అధికార వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కయిందని ఒక విమర్శ ప్రధానంగా ఒక వర్గం మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి వారు సైతం టీడీపీ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి చూపించినంత చొరవ అధికార వైఎస్ఆర్సీపీ వ్యాఖ్యలను తిప్పి కొట్టడానికి చూపించరు అన్న వాదనా ఉంది. అయితే.. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, అధికార వైఎస్ఆర్సీపీని ఢీ కొనడానికి ప్రయత్నిస్తుందా లేక ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేసి, టీడీపీని నిర్వీర్యం చేసే దిశలో ఎక్కువ ఫోకస్ చేసి, అధికార వైఎస్ఆర్సీపీకి ఊపిరి పోస్తుందా అన్నది చూడాలి.
Also Read: తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? బలమెంత?
పైగా స్టీల్ ప్లాంట్ సహా కొన్ని విషయాల్లో అధికార వైఎస్సార్సీపీకి బీజేపీకి వెనకాల ఒప్పందాలు ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శల్లో ఏ మేరకు నిజం ఉందన్నది కూడా తేలిపోయే అవకాశం ఉంది. అదీ కాక సామాజిక సమీకరణాల పరంగా బీజేపీతో పోలిస్తే ఇక్కడ జనసేనకు కొంత అడ్వాంటేజ్ ఉందనే విశ్లేషణల నేపథ్యంలో జనసేనకి టికెట్ ఇవ్వకుండా బీజేపీకి టికెట్ తీసుకోవడం వెనకాల- గెలవాలనే పట్టుదల ఉందా లేక వైఎస్ఆర్సీపీకి లోపాయికారిగా మేలు చేకూర్చే ఉద్దేశం ఉందా అన్నది కూడా తిరుపతి ఉప ఎన్నిక తేల్చి వేయనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, వైఎస్ఆర్సీపీకి బీజేపీకి మధ్య నిజంగా తెరవెనుక ఏ రకమైన సంబంధమైనా ఉందా, లేదా అన్నది తిరుపతి ఉప ఎన్నిక తేల్చి వేయనుంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More