Telangana Politics: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ లో ఎండలతో పాటు తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడు పార్టీలు, వాటి వ్యూహకర్తలు ఏప్రిల్ లో పనితనం స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు.
ఆయన చేసిన సర్వేల ప్రకారం కేసీఆర్ కు కొన్ని సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా యూత్ లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించడానికి జాబ్ నోటిఫికేషన్ లు వేయించడంతో పాటు.. కొందరు ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత.. మంత్రుల పనితీరుపై కేసీఆర్ కు రిపోర్టులు ఇప్పించారు. ఇక రానున్న రోజుల్లో ప్రశాంత్ కిషోర్ మరింత వేగంగా గా తెలంగాణలో తన పని తనం చూపించబోతున్నారు. దీంతో తామేం తక్కువ తినలేదని.. ప్రశాంత్ కిషోర్ కు పోటీగా కాంగ్రెస్ మరో వ్యూహకర్తను రంగంలోకి దించింది.
Also Read: Gram Panchayat AP: పండుగ పూట షాక్.. పంచాయతీల ఖాతాలు గుల్ల
కాంగ్రెస్ తరఫున పని చేయడానికి సునీల్ కనుగోలును రాహుల్ గాంధీ దించారు. ఈ నెల 4న ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సునీల్ ను రాహుల్ పరిచయం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్లు సైతం అందుబాటులో ఉండాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారని ఇప్పటికే సీనియర్లు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇక నుంచి కాంగ్రెస్ లో వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు ఉండొద్దని.. పార్టీ కేంద్రంగా రాజకీయాలు ఉండాలని రాహుల్ భావిస్తున్నారు. అందుకే ఇక నుంచి తెలంగాణలో పార్టీ వ్యవహారాలను తానే దగ్గరుండి చూసుకోవాలని రాహుల్ భావిస్తున్నారట.
ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా.. బీజేపీ మాత్రం తమ సొంత పార్టీ నేతలనే నమ్ముకుంటుంది. తెలంగాణలో పార్టీని గెలిపించే బాధ్యతలను ఇతర రాష్ట్రాల నేతలకు అప్పగించారు అమిత్ షా. పార్టీని మరింత జోరుగా ముందుకు నడిపించే క్రమంలో ఆయన ఈ నెలలోనే రెండు రోజులు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఆ సమయంలోనే ఇతర రాష్ట్రాల నేతలను తెలంగాణ నేతలకు పరిచయం చేయబోతున్నారు.
ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలను సిద్ధం చేసుకొని ఉంచుకుంటున్నారు. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏంటంటే.. అన్ని పార్టీలు కూడా తమ వ్యక్తిగత నిర్ణయాల కంటే.. వ్యూహకర్తల నిర్ణయాలతో పాటు పార్టీలోని దిట్టలను నమ్ముకుంటున్నాయి. మరి ఈ ఈ మూడు పార్టీల్లో ఎవరి వ్యూహాలు ఎక్కువగా పని చేస్తాయో.. ఎవరికి అధికారం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాలి.
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read More