TDP Cycle Symbol: తెలుగుదేశం ప్రాభవానికి సైకిల్ గుర్తు కూడా కారణం. ప్రజల్లో పార్టీని బలంగా తీసుకెళ్లడానికి ఎంతో దోహదపడింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టే సమయంలో ఇప్పటిలా అత్యాధునిక వాహనాలు అంటూ ఉండేవి కావు. ప్రజలు ఎక్కువగా రవాణా సాధనంగా సైకిల్ నే వినియోగించేవారు. దీంతో సైకిల్ గుర్తుతో టీడీపీ ఫేమస్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ తన పార్టీకి సైకిల్ గుర్తు పొందడానికి చాలా రకాల సెంటిమెంట్లు పనిచేశాయి. ఆయనకు సైకిల్ తో చాలా అనుబంధం ఉండేది. 1923 మే 28న కృష్ణ జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఎన్టీఆర్ తల్లిదండ్రులు లక్ష్మయ్య, వెంకట రామమ్మలు. ఎన్టీఆర్కు ముందు కృష్ణ అని పేరు పెట్టాలనుకున్నారు.. కానీ మేనమామ తారక రాముడని నామకరణం చేశారు.
నందమూరి తారక రామారావు కాలేజీలో చదివే రోజుల్లో, కుటుంబానికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడంతో పాల వ్యాపారం చేశారు. ఆ తర్వాత కిరాణా కొట్టు నడిపారు. అనంతరం మంగళగిరి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించారు. ఎన్టీఆర్కు సైకిల్ అంటే ఇష్టం. ఆయనకు చిన్నతనంలో పాత హెర్క్యులెస్ సైకిల్ ఉండేది. ప్రతి రోజూ పొద్దున, సాయంత్రం పాలు పితికి, క్యాన్లలో పోసి సైకిల్కు కట్టుకుని వాడుక ఇళ్లకు, చిన్న హోటళ్లకు పోసి వచ్చే వారు. చిన్నప్పటి నుంచి సైకిల్ తో ఉన్న అనుబంధంతోనే ఆ గుర్తు అయితే టీడీపీకి సరిపోతుందని భావించారు. 1984 ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ ఆ సైకిల్ గుర్తు టీడీపీకి కొనసాగుతోంది.
2019 ఎన్నికల సమయంలో టీడీపీ సైకిల్ గుర్తుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ జాతీయ పార్టీగా మారడంతో సైకిల్ గుర్తును తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యూపీలో ప్రాంతీయ పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీకి సైకిల్ గుర్తునే కేటాయించారు. తరువాత ఆ పార్టీ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీచేయడంతో జాతీయ పార్టీగా గుర్తించారు. రాష్ట్ర విభజన తరువాత అటు తెలంగాణలో, ఇటు ఏపీతో పాటు అండమాన్ లో టీడీపీ బరిలో నిలవడంతో తెలుగుదేశం పార్టీ సైతం జాతీయ పార్టీగా మారింది. రెండు జాతీయ పార్టీలకు సైకిల్ గుర్తు కేటాయించకూడదని ఫిర్యాదుదారులు లేవనెత్తారు. కానీ ఈసీ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టీడీపీకి సైకిల్ గుర్తు కొనసాగింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More