ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయన ఆస్తులపై విచారణ జరుపుతున్న సీఎం కేసీఆర్ కు తాజాగా ఈటల భార్య జమున సవాళ్లు విసిరారు. కులాలు, ఉద్యమ ప్రస్థానంలో తాము పడ్డ ఆవేదనను కళ్లకు గట్టారు. పాత చరిత్రను తవ్వి మరీ కేసీఆర్ తీరును జమున ఎండగట్టారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం వదిలి రావాల్సిందిగా నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఎంతో ఒత్తిడి వచ్చిందని ఈటల రాజేందర్ భార్య జమున చెప్పుకొచ్చారు. అప్పటి మంత్రి రత్నాకర్ రావు చాలా సార్లు తమకు చెప్పారని కానీ మేం టీఆర్ఎస్ ను వదిలి వెళ్లలేదని జమున తమ నిబద్ధతను చాటి చెప్పారు.
సమైక్య పాలనలోనూ ఇలాంటి కులగజ్జిని చూడలేదని జమున అన్నారు. కుల రహిత సమాజం కావాలని కోరుకున్నానని తెలిపారు. ఇప్పుడు కులాలతోనే విభజన చేస్తున్నారని కేసీఆర్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు.
అన్ని కులాలు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందని.. రాష్ట్రం ఏర్పడ్డాక అవమానాలు పెరిగాయని జమున కేసీఆర్ సర్కార్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తాము పౌల్ట్రీ ఫాంలు అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశామని.. కానీ ఇప్పుడు ఇంతలా అవమానకరంగా బయటకు పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొన్నామని.. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తామని జమున తెలిపారు. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా? అని ప్రశ్నించారు. మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. న్యాయం గెలుస్తుందని.. ధర్మం నిలబడుతుందని కేసీఆర్ కు పంచులు వేస్తూ జమున ముగించారు.