Revanth Reddy Vs KTR : తెలంగాణలో అధికారం తమ చేతిలో ఉంది కాబట్టి తాము ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్న కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్రెడ్డి నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తమపై ఆరోపణలు చేసేవారికి లీగల్ నోటీసులు పంపించి నోళ్లు మూయిస్తున్న కల్వకుంట్ల ఫ్యామిలీకి అదే లీగల్తో గువ్వ గుయ్యిమనిపించాడు టీపీసీసీ చీఫ్. టీఎస్పీఎస్పీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని, బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం ఎదుర్కోవాలని తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులను లీగల్గానే ఎదుర్కొంటామని బండి సంజయ్ నోటీసులు అందిన రెండు రోజులకే స్పష్టం చేశారు. ఇక రేవంత్ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. కానీ, చివరకు ఆయన ఇచ్చిన రిప్లైకి కేటీఆర్ వద్ద కనీసం సమాధానం కూడా లేకుండా పోయింది.
క్రిమినల్ చర్యలు తప్పవని రిప్లయ్..
పేపర్ లీకేజీ కేసులో తనపై ఆరోపణలు చేసినందుకు వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని నోటీసులు పంపిన కేటీఆర్ నోటీసులు పంపించాడు. దీనికి రేవంత్రెడ్డి భిన్నమైన సమాధానం ఇచ్చారు. నోటీసులు వెనక్కి తసుకోకపోతే తానే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని బెదిరించారు. ఎలా తీసుకుంటానో కూడా కేటీఆర్కు తన రిప్లయ్లో వివరించాడు. తాను నిరుద్యోగుల తరపున మాట్లాడానని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీకి టెక్నికల్ సపోర్ట్ మొత్తం ఐటీ శాఖ ఇస్తుందని.. అలాంటప్పుడు ఐటీ శాఖకు సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. ఈ కేసు విషయంలో సీబీఐ విచారణ కావాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశామని గుర్తు చేశారు. అసలు తెలంగాణ ఉద్యమమే నియామకాల నినాదంతో ప్రారంభమయిందని.. అసలు ఉద్యమానికి కేటీఆర్కు సంబంధం లేదన్నారు. విదేశాల్లో గడిపి వచ్చిన కేటీఆర్కు తెలంగాణ నిరుద్యోగుల బాధలు తెలియవని మండిపడ్డారు. కేటీఆర్ పంపిన లేఖలో పలు అంశాలను గుర్తు చేస్తూ.. నోటీసులను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకంటానని రివర్స్లో రేవంత్రెడ్డి హెచ్చరించారు.
రేవంత్కు సిట్ నోటీసులు..
పేపర్ లీక్ వ్యవహారం కేటీఆర్పై రేవంత్రెడ్డి పలు ఆరోపణలు చేశారు. దీనిపై ఆధారాలు ఇవ్వాలని రేవంత్రెడ్డికి సిట్ కూడా నోటీసులు జారీ చేసింది. ఆయన సిట్ ఎదుట హాజరై తన వద్ద ఉన్న వివరాలు ఇచ్చారు. ఆ తర్వాత సిట్ ఆయనపై కేసు పెడుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటి చర్యలు ఇంకా తీసుకోలేదు. కానీ కేటీఆర్ పరువు నష్టం దావా పేరుతో రేవంత్రెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా వికటించినట్లుగా కనిపిస్తోంది. కేటీఆర్ తదుపరి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
వంద కోట్లు ఇచ్చి బూతులు తిట్టొచ్చా?
కేటీఆర్ ఇచ్చిన నోటీసులపై రేవంత్ గతంలో కూడా ఘాటుగా స్పందించారు. తన పరువు విలువ వందకోట్లు అని ఎలా లెక్క కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా వంద కోట్లు ఇస్తే మరి కేటీఆర్ను అమ్మనా బూతులు తిట్టొచ్చా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేటీఆర్ను అడగాలని మీడియాకు సూచించారు. అంతే కాదు వందకోట్లకు నోటీసులు అంటే ఇదేమైనా రకుల్ప్రీత్సింగ్తో అగ్రిమెంటా.. సమంతతో వెబ్సిరీస్ ఒప్పందమా అని ప్రశ్నించారు.
మొత్తంగా కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇస్తున్న కౌంటర్లకు తిరిగి సమాధానం కూడా ఇచ్చే పరిస్థితి కేటీఆర్ వద్ద ఉండడం లేదు. రివర్స్ కౌంటర్లతో కేటీఆరే ఇరుకున పడుతున్న పరిస్థితి. దీంతో తెలంగాణ ప్రజానీకం కూడా రేవంత్ చెప్పేది నిజమేగా అని ఫీల్ అవుతున్నారు. మరి తర్వాత కేటీఆర్ ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి.