Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ లేనిపోని వివాదాల్లో తల దూర్చుతున్నారు. తాజాగా ఆయన ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఇటీవల గోదావరి జిల్లాలో జరిగిన ఓ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేసిన వారిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆదేశాలతో జరిగినట్లు.. ఇది మంచి పద్ధతి కాదు అంటూ ప్రకాష్ రాజు ట్విట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ కర్ణాటక ధర్మస్థలి వివాదంలో ఉన్నారు. మరోవైపు నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కలిగి ఉండడం పై కూడా ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏపీలో అనవసర వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగానే ఆయనకు హెచ్చరికలు పంపారు. అనవసరంగా ఏపీ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.
* ప్రశ్నిస్తాను అంటూ..
ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ పార్టీ భావజాలాన్ని తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీతో జత కడుతున్న రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ప్రకటనల విషయంలో ప్రకాష్ రాజ్ తీవ్రంగా విభేదిస్తూ అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తాను అంటూ నిత్యం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యూట్యూబర్ అరెస్టు కాగా.. మరొకరిపై కేసు కూడా నమోదయింది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తారా అంటూ నిలదీశారు.
* ఆ రెండు వివాదాల్లో..
దక్షిణ భారతదేశంలో ఏ పరిణామాలు చోటు చేసుకున్న ప్రకాష్ రాజ్ స్పందిస్తున్నారు. ముఖ్యంగా హిందుత్వ వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇటీవల కర్ణాటక ధర్మస్థలపై అంతర్జాతీయంగా జరిగిన కుట్రలో.. ప్రకాష్ రాజ్ సైతం భాగస్తుడు అని ఆరోపణలు వచ్చాయి. వాటిపై స్పష్టత ఇచ్చే క్రమంలో ప్రకాష్ రాజ్ తడబడ్డారు. కన్నడ మీడియా ముందు మాట్లాడుతూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా అలా ప్రశ్నించిన జర్నలిస్టులను పెయిడ్ అంటూ పోల్చారు. ఆ వివాదం అలానే కొనసాగుతుండగా.. ప్రకాష్ రాజ్ దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాల్లో ఓటరు ఐడి కలిగి ఉన్నారని కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దానిపై కోర్టు సీరియస్ అయింది. విచారణకు పిలిచిన ప్రకాష్ రాజ్ హాజరు కాలేదు. దీనిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా ప్రధానంగా వివాదాల్లో ఉన్న ఆయన ఇప్పుడు ఏపీ రాజకీయ వ్యవహారాల్లో… అందులో మతపరమైన వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా నిలుస్తుండడం విశేషం.

