హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ల్యాబ్ టెక్నీషియన్ ఉమా మహేశ్వర్ తోపాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి స్పందించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని, పూర్తి విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నర్సింహులు అనే వ్యక్తి.. కిడ్నీ సంబంధిత సమస్యతో ఆగస్టు 4వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు తోడుగా అతని భార్య, ఆమె సోదరి ఆసుపత్రికి వచ్చారు. అయితే.. ఆసుపత్రిలో వారి గ్రామానికే చెందిన ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. తమకు తెలిసిన వాడని వెళ్లి కలిశారు. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన నర్సింహులుకు చికిత్స జరిగింది. అయితే.. ఆ తర్వాత నుంచి అతని భార్య, ఆమె సోదరి ఇద్దరూ కనిపించకుండా పోయారు. వాళ్లు ఎటు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? అనేది ఎవ్వరికీ తెలియకుండా పోయింది.
అయితే.. కనిపించకుండా పోయిన అక్కాచెళ్లెళ్లలో.. ఊహించని విధంగా చెల్లి మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తనతోపాటు తన అక్కని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపింది. ఉమామహేశ్వర్ నుంచి తప్పించుకుని బయటపడ్డానని చెప్పింది. తన అక్క జాడ మాత్రం తెలియలేదని పేర్కొంది. దీంతో.. మహబూబ్ నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.
దీంతో రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు విచారణ చేపట్టారు. అసలు అక్కా చెల్లెళ్లపై ఎవరెవరు అఘాయిత్యానికి పాల్పడ్డారు? ఉమామహేశ్వర్ ఒక్కడేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో కేసును శోధించారు. ఈ క్రమంలో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమామహేశ్వర్ తోపాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్టు చేసి.. విచారణ చేపట్టారు.
అయితే.. అక్కాచెళ్లెల్లు ఇద్దరికి కల్లు తాగే అలవాటుందని, ఈ విషయం తెలిసిన ఉమామహేశ్వర్ అందులో మత్తు మందు కలిపి వీరిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అక్క కనిపించకపోవడంతో ఆమె ఎక్కడ ఉంది? అసలు ప్రాణాలతోనే ఉందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, ఆసుపత్రిలో ఉన్న మొత్తం 189 సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత అసలు విషయం ఏంటన్నది తెలుస్తుందన్నారు.