Fuel Shortage Panic: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులుగా పెట్రఃల్ బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో పెట్రోల్ దొరకదు అనే వదంతులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఫలితంగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు క్యూ కడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతోంది. డీలర్ల అసోసియేషన్ కూడా కొరత లేదని లేఖ విడుదల చేసింది. అయినా పెట్రోల్ కొరత ప్రచారం ఆగడం లేదు. క్యూలు పెరుగుతూనే ఉన్నాయి.
తప్పుడు సమాచారం వ్యాప్తి..
సాధారణ రోజువారీ డిమాండ్కు సరిపడా స్టాక్ ఉన్నా, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన ఫేక్ పుకార్లు ప్రజలను భయపెట్టాయి. దీంతో ఒకరు ట్యాంక్ ఫుల్ చేసుకుంటే, మిగిలినవారు కూడా చేరి ట్యాంకులు ఫుల్ చేసుకోవడమే కాకుండా పీపాలు, సీసాల్లో ఇళ్లకు తీసుకెళ్తున్నారు. దీంతో సాధారణంగా మూడు రోజుల స్టాక్ కొన్ని గంటల్లో సేల్ అవుతోంది. ఫలితంగా బంకులు తాత్కాలికంగా మూసివేసి మరింత భయాన్ని పెంచుతున్నారు.
అంతర్జాతీయ ప్రభావం
అమెరికా–ఇరాన్ యుద్ధం వల్ల బ్రెంట్ క్రూడ్ ధర 100 నుంచి 120 డాలర్లకు చేరింది. హార్మూజ్ జలసంధి మూసివేతతో దిగుమతులపై ప్రభావం పడింది. అయితే ఇటీవల ఇరాన్ శత్రు నౌకలు మినహా మిగతా అన్నింటికి ద్వారా తెరిచామని ప్రకటించింది. దీంతో భారత నౌకలు కూడా హార్మూజ్ దాటి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలో పెట్రోలియం కొరత వదంతులు ఇబ్బందిగా మారాయి. యుద్ధం నేపథ్యంలో కేంద్రం 50 రోజుల నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. అయినా వదంతులు ప్రజల్లో ప్యానిక్ పెంచుతున్నాయి.
Also Read: ఇదేం చోద్యం.. బకెట్లు, క్యాన్లు, కుక్కర్లలో నింపుకెళుతున్నారు..
స్టాక్ క్లియరెన్స్ కోసమే..
కొందరు బంక్ యజమానులు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసి అమ్మకాలు పెంచుకున్నారని తెలుస్తోంది. ఇటీవలి అరెస్టులు ఇంధన మెషీన్లలో మోసాలకు సంబంధించినవి మాత్రమే. పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ పుకార్లను ఖండించి, ప్రజలకు శాంతించమని సూచించింది. పోలీసులు, ప్రభుత్వం నిఘా పెంచి, హోర్డింగ్పై చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రజలు ఫేక్ న్యూస్ను నమ్మకుండా అధికారిక వార్తలు మాత్రమే నమ్మాలి. అనవసర నిల్వలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. సాధారణగానే ఇంధనం వాడుకోవాలి. ఇదే సమయంలో ప్రభుత్వం సరఫరాను పెంచుతూ స్టాక్ సమస్య లేదని చెబుతోంది.
