లాక్ డౌన్ కాలనికి మధ్య తరగతి వారిని ఆడుకొంటున్నామంటూ ఆర్బీఐ ప్రకటించిన ఈఎంఐల మారటోరియంతో పెద్దగా ఒరిగే ప్రయోజనం అంటూ ఏమి ఉండబోదని, తడిసి మోపెడు అన్నట్లు వారిపై మరింత భారం పడుతుందని స్వయంగా బ్యాంకర్లే స్పష్టం చేస్తున్నారు.
ఈ మూడు నెలలు ఈఎంఐలు చెల్లించకపోతే ఆ తర్వాత వడ్డీతోసహా కట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు. వెసులుబాటు ఉంటె ఇప్పుడే కట్టుకోవడం అత్యుత్తమం అని స్పష్టం చేస్తున్నారు.
గత నెల 27న ఆర్బీఐ ప్రకటించిన వివరాల ప్రకారం అన్ని టర్మ్ లోన్లపై మారటోరియం తీసుకునే అవకాశం రుణగ్రహీతలకు ఉంటుంది. మార్చి 1 నుంచి మే 31 వరకు ఉన్న కాలానికి సంబంధించిన ఈఎంఐలను వాయిదా వేసుకోవచ్చు. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈఎంఐ చెల్లింపులకు దూరంగా ఉండొచ్చు.
అయితే ఈఎంఐలను వాయిదా వేసుకోవడం వల్ల రుణగ్రహీతలకు లాభమేమీ ఉండదని బ్యాంకర్లు చెబుతున్నారు. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత ఈ మూడు నెలల విరామ కాలానికి వడ్డీ లెక్కించి వేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ స్పష్టం చేసింది. మారటోరియం తీసుకున్న కస్టమర్ల నుంచి ఈ వడ్డీని అదనపు ఈఎంఐల ద్వారా వసూలు చేస్తామని వెల్లడించింది.
ఉదాహరణకు 8.3 శాతం వడ్డీరేటుతో రూ.30 లక్షల గృహ రుణం తీసుకున్న వ్యక్తి 15 సంవత్సరాలు దాని ఈఎంఐలు చెల్లించాలనుకుందాం. వీరు ఈ మూడు నెలల మారటోరియం తీసుకుంటే మొత్తం రుణ కాలపరిమితిలో అదనంగా నికర వడ్డీ దాదాపు రూ 2.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇది వీరిప్పుడు చెల్లిస్తున్న 8 నెలల ఈఎంఐలకు సమానమని ఎస్బీఐ తెలిపింది. అలాగే రూ.6 లక్షల వాహన రుణం 54 నెలల కాలవ్యవధితో తీసుకున్నవారు మారటోరియంను తీసుకుంటే రూ.19వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది వీరు సాధారణంగా చెల్లించే ఈఎంఐలకు ఒకటిన్నర రెట్లు అధికం. కాబట్టి నగదు కొరత లేనివారు మారటోరియానికి దూరంగా ఉండటమే ఉత్తమమని బ్యాంకులు చెప్తున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇదే సూచిస్తున్నది. అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలపరిమితి పొడిగింపు నుంచి తప్పించుకోవాలని హితవు పలికింది. కాగా, కరోనా కారణంగా తమ ఆదాయం దెబ్బతిన్నవారే మారటోరియంను తీసుకోవాలని భారతీయ బ్యాంకింగ్ సంఘం రుణగ్రహీతలకు సూచించింది. దాదాపు వేతన జీవుల కంటే వ్యాపారులకు మారటోరియం ఇప్పుడు లాభదాయకమని అభిప్రాయపడింది.