
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేశాడని పోలీసులు వెల్లడించా రు. ఇంత వరకు బాగానే ఉన్నా పెద్దమొత్తంలో నిద్ర మాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడనే వివరాలు చెప్పకపోవడం గమనార్హం. విచారణలో భాగంగా నిందితుడు వరంగల్ చౌరస్తాలోని ఓ షాపులో మాత్రలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెబుతున్నా ఆ షాపు పేరు బహిర్గతం చేయడం లేదు. దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగాక పోలీసులు పడక్బందీ వ్యూహంతో ఏడు బృందాలు విడిపోయి మూడు రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు.. ఇంత మందిని హతమార్చేందుకు గాను బాధితులకు మత్తు కోసం 60 వరకు నిద్రమాత్రలను ఉపయోగించాడని ప్రకటించారు. కానీ నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాపు పేరు కనుక్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులకు షాపు పేరు తెలిసినా వెల్లడించడం లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హంతుకుడిగా కఠిన శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు.. మందుల షాపు విషయంలో ఈ రహస్యం ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది