Highway toll without stopping: టెక్నాలజీ పెరుగుతోంది. మనుషుల అవసరాల తగ్గట్టుగా సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి సాగుతోంది. దీంతో ఒకప్పుడు గొప్పగా అనిపించిన పనులు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటికి మించిన పనులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా మనుషుల జీవనం మరింత సాఫీగా సాగిపోతోంది.
మనదేశంలో జాతీయ రహదారులు అనేకం ఉన్నాయి. వీటిలో చాలా వరకు రహదారులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించారు. ఈ ప్రకారం వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తుంటారు. ఈ ప్రక్రియ మొత్తం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాగిపోతూ ఉంటుంది. గతంలో హైవేల మీద వాహనాలు ప్రయాణించినప్పుడు టోల్ వసూలు చేసేవారు. మొదట్లో డబ్బు స్వీకరించే విధానం మాన్యువల్ విధానంలో సాగుతూ ఉండేది. ఆ తర్వాత డిజిటల్ పేమెంట్లు.. అనంతరం ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఫాస్టాగ్ వల్ల వాహన దారులు కేవలం తమ వాహనాన్ని టోల్ ప్లాజా వద్ద నిమిషాల వ్యవధి వరకు ఆప్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా పాతగా మారిపోయింది.
జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ఇబ్బందులను పరిష్కరించడానికి కేంద్రం వినూత్నమైన విధానాన్ని తీసుకొచ్చింది. డిసెంబర్ నుంచి వాహనాలు ఆగకుండానే టోల్ వసూలు చేస్తారు. దీనికోసం ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఏఐ అనలిటిక్స్ కూడా వాడుతున్నారు. దీనివల్ల వాహనాలు కదులుతుండగానే ఫాస్టాగ్ రీడర్లు గుర్తిస్తాయి. అంతే వేగంగా టోల్ ఛార్జ్ చేస్తాయి. ఒకవేళ ఫాస్టాగ్ పని చేయకపోతే ఈ విధానంలో నోటీసులు జారీ అవుతుంటాయి. అంతేకాదు వాహన్ పోర్టల్ ద్వారా పెనాల్టీ కూడా విధిస్తారు.
ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారి సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రయోగదశ విజయవంతం కావడంతో.. త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించిన కేంద్రం.. దానికి డిసెంబర్ నెలలో ముహూర్తంగా ప్రకటించింది. డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ విధానం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా వాహనాలు నిలిపివేసిన అవసరం లేకుండానే టోల్ చెల్లించవచ్చు.