నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించగా, ఈ నెల 3వ తేదీ ఉదయం జరిగిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్థానిక అధికారులు అతనిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అదే రోజు సాయంత్రం వచ్చిన మరో రిపోర్టులో అతనికి వైరస్ సోకలేదని తేలింది. ఇందుకు సంబంధించిన రెండు రిపోర్టులూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలే తీవ్ర భయాందోళనల్లో ఉన్న ప్రజలు, ఈ తరహా ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కరోనా పరీక్షలకు సంబంధించిన నివేదికలు మారటం వల్ల ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రిపోర్టులు మారడంపై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అదనపు ఆర్ఎంఓ డాక్టర్ కనకాద్రి స్పందించారు. ఆ యువకుడికి కరోనా సోకలేదని తేల్చారు. సాంకేతిక సమస్య కారణంగా తొలుత వచ్చిన రిపోర్టు పాజిటివ్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆపై తప్పు సరిచేసుకుని, దాన్ని నెగటివ్ గా నిర్దారించి, రిపోర్టును ఆసుపత్రికి పంపించారని తెలియజేశారు.