NEET Paper Leak: కొత్త బొక్కలను పూడ్చే క్రమంలో పాత వ్యవహారాలు బయటపడ్డట్టు.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని విచారణ చేస్తున్న సిబిఐ అధికారులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో జరిగిన లీక్ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.
నీట్ పేపర్ లీకేజీలో కీలక సూత్రధారిగా వికాస్ ను ఇప్పటికే సిబిఐ అధికారులు గుర్తించారు. అయితే అతడు గత ఏడాది యష్ యాదవ్ అనే వ్యక్తి నుంచి నీట్ ప్రశ్న పత్రం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా అక్కడినుంచి వికాస్ ఈ పేపర్ కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఈ కొనుగోలు వ్యవహారంలో యష్ తండ్రి మంగీలాల్, మామ దినేష్ హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. వికాస్ సోదరి ప్రగతి.. దగ్గరి బంధువులు సానియా, గుంజన్, పలాక్ కూడా గత ఏడాది మెడికల్ సీట్లు పొందారు. లీక్ అయిన పేపర్ ద్వారానే వీరు సీట్లు సాధించినట్లు సమాచారం.
మామూలోడు కాదు
వికాస్ పదో తరగతిలో 63% మార్కులు మాత్రమే సాధించాడు. ఇంటర్లో 55% మార్కులు వచ్చాయి. 2024 లో నీట్ రాస్తే 720 మార్కులకు గాను 240 మార్కులు మాత్రమే సాధించాడు. సికార్ ప్రాంతంలో ఒక శిక్షణ కేంద్రంలో 46 పరీక్షలు రాశాడు. సగటున 384 మార్కులు మాత్రమే సాధించాడు. అయితే 2025లో 85.11 పర్సంటేజ్ తో ఏకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు.
వికాస్ సోదరి ప్రగతికి పదవ తరగతిలో 69 శాతం మార్కులు వచ్చాయి. ఇంటర్లో 91% సాధించింది. 2024లో నీట్ పరీక్ష రాస్తే 720 మార్కులకు గాను 355 వచ్చాయి. సికార్ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లో 50 నమూనా పరీక్షలు రాసింది. ఎప్పుడు కూడా ఆమెకు 320 నుంచి 342 మార్కులు దాటలేదు. 2025లో మాత్రం ఆమెకు 92.53% వచ్చింది. నీతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.
వికాస్ దగ్గర బంధువు సానియాకు పదవ తరగతిలో 63%, 12వ తరగతిలో 89% మార్కులు వచ్చాయి. 2024 లో నీట్ రాస్తే 320 మార్కులు వచ్చాయి. సికార్ లో 49 మోడల్ టెస్టులు రాస్తే ఆమెకు ఏకంగా 515 నుంచి 550 మార్కులు మాత్రమే వచ్చాయి. 2025లో నీట్ రాస్తే 98.61 పర్సంటేజ్ వచ్చింది. ఆమె జైపూర్ ప్రాంతంలో ఓ గవర్నమెంట్ కాలేజీలో చదువుతోంది.
ఇప్పుడు కూడా వికాస్ కుటుంబ సభ్యులు రిషి అనే తమ బంధువు కోసం పేపర్ కొనుగోలు చేశారు. ఇతడికి పదవ తరగతిలో 43 శాతం.. ఇంటర్లో 50% మాత్రం మార్కులే వచ్చాయి..
పేపర్ లీకేజ్ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. సిబిఐ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
