Homeజాతీయ వార్తలుమోడీ అందుకే ఇంతకాలం ఆగాల్సి వచ్చిందా..?

మోడీ అందుకే ఇంతకాలం ఆగాల్సి వచ్చిందా..?

Modi
ఫస్ట్‌ ఐదేళ్లు దిగ్విజయంగా పరిపాలన పూర్తి చేసిన నరేంద్ర మోడీ.. తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి అధికారంలోకి రెండేళ్లు కావస్తోంది. అయితే.. రెండో సారి అధికారంలోకి వచ్చాక మోడీ ఇంతవరకూ మంత్రి వర్గ విస్తరణ చేపట్టలేదు. ఇప్పుడు పార్టీలో అదే చర్చనీయాంశం అయింది. ఈనెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. ఇంకో నెలలో ఉంటుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ అయితే చేసింది లేదు. మరోవైపు.. ఆశావహులు మాత్రం ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.

నిజానికి బీహార్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. మోదీ కార్యాలయం మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తు చేస్తోందన్న ప్రచారమూ జరిగింది. కొందరు మంత్రుల పనితీరుపై మోదీ అసంతృప్తిగా ఉన్నారని.. అనేక రోజులుగా వార్తలు సైతం వస్తున్నాయి. అయితే.. గతేడాది మార్చిలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు. కరోనా నుంచి కాస్త కోలుకున్నాక బీహార్ ఎన్నికల తర్వాత అన్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకునేందుకు మోడీకి అవకాశం వచ్చినట్లైంది. ఇటు రైతుల ఆందోళన, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాలతో అనేక వర్గాలు మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నాయనేది వాస్తవం. ఈ ఫలితాలతో అందులో నిజానిజాలను తెలిసే అవకాశముంటుంది. ఈ ఫలితాలను బట్టి మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్నది మోడీ ఆలోచనలగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఇప్పుడున్న మంత్రివర్గంలో సుమారు పది మంది మంత్రుల పనితీరుపై మోడీ సంతృప్తికరంగా లేరనేది తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈసారి మంత్రివర్గ విస్తరణలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో మోడీ ఉన్నారట. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు మంచి టీమ్‌ను ఎంపిక చేయాలన్నది మోడీ ఉద్దేశం కూడా. అందుకే జ్యోతిరాదిత్య సింధియా లాంటి వారికి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని చెబుతున్నారు. ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్‌ను కూడా ఆ పదవి నుంచి తప్పించాలన్న ఉద్దేశంలో ఉన్నారు. మొత్తంగా చూస్తే కొంచెం ఆలస్యమైనా.. ఈసారి మంత్రివర్గ విస్తరణ పకడ్బందీగా చేపట్టేందుకు మోడీ రెడీ అయిపోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మే 2 తర్వాతే అడుగు ముందుకు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular