
MLC Kavita has started again: ఈడీ విచారణ అనగానే తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల వారసురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మహిళల సమస్యలు, మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తొస్తున్నాయి. ఈనెల 9న విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదట నోటీసులు ఇచ్చింది. దీంతో కవితక్క.. తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని 15వ తేదీ తర్వాత వస్తానని లేఖ రాసింది. కానీ, ఈడీ అందుకు అంగీకరించలేదు. 11వ తేదీన రావాల్సిందే అని రిప్లైయ్ ఇచ్చింది. దీంతో 10వ తేదీన ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష చేశారు. 11వ తేదీన ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆ రోజు 8 గంటలు విచారణ చేసిన ఈడీ, మళ్లీ 16న రావాలని నోటీసులు ఇచ్చింది.
మళ్లీ మహిళా బిల్లు కోసం రౌండ్టేబుల్ సమావేశం..
16వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సిన కవిత 15వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం మరో కార్యక్రమం చేపట్టారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని భారత్ జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలోని లే మెరేడియన్ హోటల్లో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. ఇందులో పాల్గొనేందుకు కవితక్క ఉదయమేఢిల్లీ చేరుకున్నారు. 16న ఈడీ విచారణకు హాజరవుతారు.
ఈసారి అంతా సైలెంట్..
ఈనెల 11న కవిత విచారణ సందర్భంగా అటు ఢిల్లీ.. ఇటు తెలంగాణలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అరెస్ట్ చేస్తారని ఎక్కువ మంది నమ్మారు. అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయనో.. మరో కారణమో కానీ విచారణ చేసి కవితను పంపేశారు. 16న హాజరు కావాలని ఆదేశించారు. ఈసారి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొంత మంది ఢిల్లీకి చేరుకోవచ్చు కానీ.. గతంలోలా కవితకు మద్దతుగా హంగామా చేయకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో దాదాపుగా అందర్నీ అరెస్ట్ చేశారు. కింగ్ పిన్గా సీబీఐ కవితను ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ ఆమెను ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు. ఈ విషయాన్ని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ విషయంలో ఈ సారి ఈడీ కఠిన నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపుæ కవితను అరెస్ట్ చేస్తే ఎలాంటి ఉద్యమం చేయాలో బీఆర్ఎస్ ఇప్పటికే ఓ కార్యాచరణ రెడీ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.