వైజాగ్ లోని ఆర్ఆర్ వెంటకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. పరిశ్రమ నుంచి వెలువడిన విషవాయువు నిద్రమత్తులో ఉన్న వారి ప్రాణాలు తీసింది. మరికొందరిని తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. గ్యాస్ ప్రభావానికి రహదారిపై అపస్మారక స్థితిలో పడిపోయిన వారిని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఒక్కసారిగా పరుగులు తీశారు. కన్నబిడ్డలు కళ్లెదుట ఊపిరాడక విల్లవిల్లాడుతుంటే చూసి కన్నీరుమున్నీరవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు వారి తల్లిదండ్రులు. అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. గ్రామాల్లోని చెట్లన్నీ గ్యాస్ తీవ్రతకు మాడిపోయాయి. మూగ జీవాలన్నీ నేలకొరిగాయి. అనేకమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాధితులను హుటాహటిన కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో ఇప్పటివరకు చికిత్సపొందుతూ ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయువు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు. వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్ లో విశాఖ కేజీహెచ్ కు తరలించారు.