ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని సైతం పర్ఫెక్ట్ గా డీల్ చేస్తూ వచ్చిన జగన్.. సొంత పార్టీ ఎంపీ రఘురామను మాత్ర సరిగా హ్యాండిల్ చేయలేకపోయారనే అభిప్రాయం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే.. జగన్ ను చంద్రబాబు కన్నా.. రఘురామనే ఎక్కువగా ఇబ్బంది పెట్టారన్నది అందరికీ కనిపిస్తున్నదే. ఈ వ్యవహారం ఇప్పటితో సమసిపోలేదు. ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలియదు. అయితే.. ఈ రెబల్ గొడవ ఈయన ఒక్కడితోనే తీరిపోలేదని, ఇంకా కొందరు ఉన్నారనే ప్రచారం సాగుతుండడమే ఇప్పుడు హాట్ టాపిక్.
కారణాలు ఏవైనా.. అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అంటున్నారు నర్సాపురం ఎంపీ. అయితే.. ఈయన ముందుగా బయటపడ్డారని, లోలోపల రగిలిపోతూ.. సమయం కోసం వేచి చూస్తున్నవారు మాత్రం వైసీపీలో చాలా మందే ఉన్నారని అంటున్నారు. దీనికి కారణం.. వారికి జగన్ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడమేననే చర్చ సాగుతోంది. వీరిలో ప్రధానంగా ఎంపీలు ఉన్నారని అంటున్నారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యక్రమాలకూ వారికి ఆహ్వానాలు అందట్లేదట. అంతేకాదు.. పార్టీ పరంగా జరిగే కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేల హవానే కొనసాగుతోందని వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. నామినేట్ పదవుల విషయంలోనూ తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని వాపోతున్నారట. కనీసం తమ గెలుపుకోసం పనిచేసిన వారికి కూడా ఏమీ చేయలేకపోతున్నామని అసంతృప్తితో రగలిపోతున్నారట. ఈ జాబితాలో కోస్తాకు చెందిన ఇద్దరు ఎంపీలతోపాటు మరికొందరు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. జగన్ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు సైతం కారాలు మిరియాలూ నూరుతున్నారట.
తమ ఇబ్బందులను గతంలోనే జగన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఇప్పటిదాకా పరిష్కారం చూపలేదని అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ఎన్నికలనాటికి వీళ్లంతా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. అవసరమైతే పార్టీ మారే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఒక్క ఆర్ ఆర్ ఆర్ తోనే ఇబ్బంది పడుతున్నారు.. మరి, ఇంకొందరు తోడైతే ఖచ్చితంగా ఇబ్బందే. ఇదిలాఉంటే.. ముందు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది. దీన్ని సరిగా హ్యాండిల్ చేయకపోతే.. రెబల్ జాబితా పెరిగిపోతుందనే అభిప్రాయంగా కూడా వైసీపీలోనే బలంగా వినిపిస్తోంది. మరి, ఈ పరిస్థితిని జగన్ ఎలా డీల్ చేస్తారన్నదే ఆసక్తికరం.