Nara Lokosh: చంద్రబాబు రాజకీయంగా అటుపోట్లు చూశారు. సుదీర్ఘ కాలం ఉమ్మడి ఏపీ సీఎంగా, విపక్ష నేతగా, అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. అటు జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. కానీ కుమారుడు లోకేష్ కు మాత్రం మంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేకపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా జగన్ తండ్రి చాటున రాజకీయాలు ప్రారంభించారు. తొలిసారిగా పోటీచేసి గెలుపొందారు. పొలిటికల్ జర్నీని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే లోకేష్ విషయంలో మాత్రం అది జరగలేదు. లోకేష్ ను ఎమ్మెల్సీగా ఎన్నుకొని మంత్రి చేసిన చంద్రబాబు.. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం లోకేష్ ను గట్టెక్కించలేకపోయారు. రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నేరుగా పోటీచేయించాలే తప్ప..దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కేటాయించారు. అన్ని తెలిసిన చంద్రబాబు ఆదిలోనే తప్పు చేశారని విశ్లేషకులు తప్పుపట్టారు. అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ఎంపిక కూడా ఒకరకమైన సాహసమే. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ గెలిచింది రెండుసార్లు మాత్రమే.

అయితే మంగళగిరి నుంచి మరోసారి బరిలో దిగేందుకు లోకేష్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయ్యకూడదని సీఎం జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకు తగ్గట్టు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ ను మంగళగిరి నుంచి ఎలాగైనా గెలిపించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గ రివ్యూ చేశారు. నియోజకవర్గంలో గెలుపునకు అవసరమైన రూట్ మ్యాప్ ను చంద్రబాబు లోకేష్ కు అందించారు. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా 12 రకాల ప్రయోజిత కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళుతున్నట్టు లోకేష్ అధినేతకు వివరించారు. భారీ మెజార్టీతో గెలుపొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని.. వైసీపీ వ్యూహాంలో చిక్కుకోవద్దని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.

ప్రస్తుతం మంగళగిరిలో లోకేష్ కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నా.. వైసీపీ వ్యూహం మాత్రం చంద్రబాబుకు కంగారు పెడుతోంది. అక్కడ సిట్టింగ్ స్థానాన్ని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం అధికం. అందుకే బీసీ కార్డు ప్రయోగించి లోకేష్ ను నిలువరించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే బీసీ నాయకులను వైసీపీ వైపు తిప్పుకున్నారు. మరికొందర్ని రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే కానీ జరిగితే లోకేష్ కు ఇబ్బందే. ఎదురీదాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు అటు తన కుప్పంతో పాటు కుమారుడి మంగళగిరిపై ఫోకస్ పెట్టాలంటే కత్తిమీద సామే. కుమారుడ్ని చంద్రబాబు ఎంత ఎత్తడానికి ప్రయత్నిస్తున్నా ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో చంద్రబాబు ఓకింత అసహనంతో ఉన్నట్టు సమాచారం. అటు వైసీపీ సైన్యం మొత్తం చంద్రబాబు, లోకేష్ లపైనే మొహరించడం చూస్తుంటే.. మంగళగిరిలో గత ఎన్నికల్లో లోగా ప్రతికూల ఫలితం వస్తుందేమోనన్న బెంగ అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లను వెంటాడుతోంది. కుమారుడికి మంచి రాజకీయ జీవితం ఇవ్వాలన్న ఫర్టీ ఈయర్స్ చంద్రబాబుకు మాత్రం వర్కవుట్ కావడం లేదన్న మాట.