MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఓవైపు లిక్కర్ స్కాంలో కూరుకుపోతుంటే.. వీడేంటిరా బాబూ కవితక్క సూపర్ అంటున్నాడనుకుంటున్నారా.. అంతే కదా మరి. ఇన్నాళ్లూ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కూతురుగా తెలంగాణకే పరిమితమైన ఆమె ఇమేజ్.. లిక్కర్ స్కాం పుణ్యమా అని దేశవ్యాప్తమైంది కదా.. తెలంగాణ లిక్కర్ పాలసీని దేశవ్యాప్తం చేయాలని ఓ మహిళా నేతగా ఆమె పడిన కష్టాన్ని అభినందించాలి కదా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అన్నీ తానై చక్రం తిప్పిన కవిత సూపరే కదా మరి.. ఒక ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గ సమస్యలపైనే.. నిజామాబాద్ పసుపు రైతుల సమస్యలపైనో ఆమె మాట్లాడలేదు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లలేదు. కేవలం తన ఆదాయం పెంచుకునేందుకు అదీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. అక్రమ మార్గంలో కోట్లు కొల్లగెట్టే దందాలో కీలకంగా మారడం గ్రేట్ కదా. దీనికి కవితకు టీఆర్ఎస్ నేతలు అండగా నిలవడం ఇంకా గ్రేట్ కదా..!

మొత్తం కవితే చేసింది..
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఎమ్మెల్సీ కవిత పాత్రను ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ సమీర్ మహేంద్రుపనై తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో స్పష్టంగా వెల్లడించింది. సౌత్ లాబీలో భారీగా ప్రయోజనాలు పొంది.. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి అసలైన యజమానికి కల్వకుంట్ల కవితేనని నిర్ధారించింది. శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్రెడ్డితో కలిసి కవిత ఈ వ్యాపారం చేశారని తెలిపింది. తన పేరు బయటకు రాకుండా అరుణ్ రామచంద్ర పిళ్లైను బినామీగా పెట్టుకున్నట్లు గుర్తించింది ఈడీ. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో మొత్తం కవితే చేశారన్నట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో కవిత ఈ స్కామ్లో నిండా మునిగిపోయినట్లుగా న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
181 పేజీల్లో.. 28 సార్లు కవిత పేరు..
ఈడీ తాజాగా దాఖలు చేసిన 181 పేజీల చార్జ్షీట్లో 28 సార్లు కవిత పేరును ప్రస్తావనకు వచ్చింది. కవిత, మాగుంట రాఘవ్, శరత్చంద్రారెడ్డి నిర్వహిస్తున్న సౌత్గ్రూప్.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని అప్రూవర్గా మారిన దినేష్ అరోరా స్పష్టం చేశారు. హైదరాబాద్, ఢిల్లీ స్టార్ హోటళ్లలో పలుమార్లు సమావేశమయ్యామని తెలిపారు. కవిత పలుమార్లు ఫేస్ టైమ్ ద్వారా నిందితులతో మాట్లాడి కలసి వ్యాపారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారని ఈడీ స్పష్టంగా తెలిపింది. సమీర్ మహేంద్ర కవితను ఆమె నివాసంలో కలిసి చర్చలు కూడా జరిపారని ఈడీ చెబుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే పనిగా చెబుతోంది. ఈ చార్జిషీటు ప్రకారం చూస్తే.. కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్గా చేయడానికి ఇంకా ఎక్కువ కాలం పట్టకపోవచ్చని భావిస్తున్నారు.

తాజా ఆధారాలు, పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఓ వైపు సీబీఐ కేసులు.. మరో వైపు ఈడీ కేసులు కవితను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తున్నాయి.