తెలంగాణలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా హైదరాబాద్ నమోదవుతూ ఉండడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పరిస్థితులపై సమీక్ష జరుపుతూ కరోనా వైరస్ సోకినవారిలో జీహెచ్ఎంసీ పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దొన్ని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ను ఒక్కో యూనిట్గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం కేసీఆర్ సూచించారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్క్ ధరించి, శానిటైజర్ ఉపయోగించారు.సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు సీఎంకు వెల్లడించారు.
‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా సోకే అవకాశాలు కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి” అని సూచించారు.
నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలి. ప్రతీ యూనిట్ కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలి. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒకో డీఎంఅండ్హెచ్ఓ ఉన్నారు. 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారిని నియమించాలని కేసీఆర్ వివరించారు.
‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగీ ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.