Homeజాతీయ వార్తలుKCR And Revanth Reddy: కేసీఆర్, రేవంత్ వి అవసరాలు.. మోసపోతున్నది తెలంగాణ ప్రజలు

KCR And Revanth Reddy: కేసీఆర్, రేవంత్ వి అవసరాలు.. మోసపోతున్నది తెలంగాణ ప్రజలు

KCR And Revanth Reddy: మనదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ లేని గొప్ప నేపథ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఎటువంటి ఉద్యమ నేపథ్యం లేకుండా ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఉద్యమాలు చేస్తే.. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తే వచ్చింది. ఆందోళనలు, నిరవధిక నిరాహార దీక్షలు, మిలియన్ మార్చ్ లు, వంటా వార్పు లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేస్తేనే తెలంగాణ సాకారమైంది.

స్వీయ అస్తిత్వ కాంక్ష అనేది తెలంగాణ మట్టిలోనే ఉంది. అందుకే ఇక్కడ రాజకీయ చైతన్యం.. సామాజిక చైతన్యం.. ప్రజలలో ధిక్కారస్వభావం అధికంగా ఉంటాయి.. కాళోజి నారాయణరావు.. జయశంకర్.. పోటు కృష్ణమూర్తి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉద్యమకారుల వారసత్వం తెలంగాణ లో ప్రతి ప్రాంతంలో కనిపిస్తూనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఏర్పడేందుకు ప్రధాన కారణం ఆంధ్ర పాలకుల దోపిడి.. వివక్ష.. వీటినుంచి తెలంగాణ తనను తాను కాపాడుకొనేందుకు అనేక రకాలుగా ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. చివరికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటువంటి వాతావరణం మళ్లీ కనిపిస్తుంటే ఇంతకంటే దారుణం మరొకటి ఏమి ఉంటుంది.

నాడు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాకను తీవ్రంగా నిరసిస్తూ మహబూబాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ కు తోడుకొని వచ్చారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ హాజరయ్యారు. అప్పట్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డికి కెసిఆర్ సహాయం చేసినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు రాయలసీమ ను బంగారు తునక చేస్తానని.. తెలంగాణ నుంచి ఎంత నీటినైనా సరే ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు.. అంతేకాదు పోతిరెడ్డిపాడు వెడల్పుకు సహకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ జమానాలో ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా చాలా జరిగాయి.. నాడు జాతీయ పార్టీ ఊహల్లో తేలియాడుతూ.. దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆరాటంలో కేసీఆర్ చాలా చేశారు. చివరికి తనే కామారెడ్డిలో ఓడిపోయారు.

ఇప్పుడు ఇదే కేసీఆర్ సరికొత్త పల్లవి అందుకున్నారు.. నాడు తెలంగాణ ఉద్యమంలో తాను కరీంనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే.. తన మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డిని ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో చేర్చుకున్నారు. ఆయనకు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అంతేకాదు ఆయనను గొప్ప నాయకుడిగా పేర్కొన్నారు. నాడు ఇదే ఎన్నికల్లో తనకు వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే ముఖ్యమని.. తెలంగాణ ఉద్యమంతో ఏం సంబంధం అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు తరచూ చంద్రబాబును.. రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా తిట్టే కేసీఆర్.. నాడు తన మీద వ్యతిరేకంగా పోటీ చేసిన జీవన్ రెడ్డిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారనేది ఇక్కడ గమనించదగ్గ విషయం.

రేవంత్ రెడ్డిని తెలంగాణ ఉద్యమకారుల మీదికి రైఫిల్ తీసుకుని వెళ్ళాడు.. ఉద్యమకారులను తిట్టాడు.. ఆంధ్ర పార్టీలో పని చేశాడు.. అంటూ విమర్శిస్తున్న గులాబీ పార్టీ నేతలు.. జీవన్ రెడ్డి రాకను ఏ విధంగా సమర్ధించుకుంటారో చెప్పాల్సి ఉంది.

ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. నాడు ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అతిగతి లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చినప్పటికీ.. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. నాడు జీవన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా పోటీలో ఉన్నప్పుడు ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి. ఆయనను గొప్ప నాయకుడిగా పేర్కొంది కూడా రేవంత్ రెడ్డినే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని విమర్శించారు. జీవన్ టోన్ అంటూ మండిపడ్డారు. అంతేకాదు జగిత్యాల నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ ను గొప్ప నాయకుడిగా అభివర్ణిస్తున్నారు..

వాస్తవానికి కెసిఆర్, రేవంత్ మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి గతంలో ఈ నాయకులు మాట్లాడిన మాటలను.. ఇప్పుడు మాట్లాడిన మాటలను ఒకసారి బెరీజు వేసుకుంటే అవసరాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. వారి పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా.. పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత మరొక విధంగా మాట్లాడటం పట్ల ప్రజలు ఈసడించుకుంటున్నారు. చివరిగా జగిత్యాల సభలో కేసీఆర్ చెప్పినట్టు దళిత బంధు లక్ష కుటుంబాలకు రాలేదు. చివరికి స్టేషన్ ఘన్ పూర్ నాటి ఎమ్మెల్యే రాజయ్య దళిత బంధు పథకాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటే.. పత్రికలలో కథనాలు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాల్సి వచ్చింది. దీనిని బట్టి నాడు కేసీఆర్ అమలు చేసిన పథకాలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా సభలో చెప్పినట్టు అందరి రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు. కొందరి రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా బ్యాంకులు ఇవ్వకుండా రుణాలలో మినహాయించుకున్నాయి.. ఏతావాతా చెప్పేది ఏంటంటే.. కెసిఆర్ కోరుకున్నట్టుగా బంగారు తెలంగాణ కాలేదు. రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా రైజింగ్ తెలంగాణ ఏర్పడలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular