గురుకులాల కార్యదర్శిగా ఎంతో ఉన్నతంగా పనిచేసి వాటిని గాడిన పెట్టిన చరిత్ర ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సొంతం.. ఒక పోలీస్ అధికారి అయ్యిండి.. గురుకులాల కార్యదర్శిగా మారి ఆయన విజయం సాధించారు. దళిత సామాజికవర్గాన్ని ‘స్వేరోస్’ పేరుతో ఏకం చేసి విజయవంతంగా నడిపించారు. అయితే అంత విజయవంతమైన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తనన కలల గురుకులాలను విడిచిపెట్టి సడెన్ గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఇంకో ఆరేళ్లు సర్వీస్ ఉండగానే ఆ పదవి నుంచి వైదొలగడం సంచలనమైంది.
ఇప్పుడు ఆయన బీఎస్పీలో చేరి దళితులందరినీ ఏకం చేసి తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ప్రవీణ్ కుమార్ ఎందుకు వైదొలిగారన్నది ఇప్పటికీ అంతుబట్టడం లేదని అంటున్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దీనిపై స్పందించారు. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై హాట్ కామెంట్స్ చేశారు.
ఉద్యోగం పోయే పరిస్థితుల్లోనే ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్ కుమార్.. ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎందుకు ప్రశ్నించరని అన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దళిత జాతిని పైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిల్లో స్వయంగా ప్రవీణ్ కుమార్ పాలుపంచుకున్నారు. ఒక్క రూపాయి దళితులకు ఇవ్వని కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించారు అని నిలదీశారు.
ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి.. ఇష్టం వచ్చిన ప్రమాణాలు చేయించి.. ఇష్టారీతిగా వ్యవహరిస్తే కేసులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని.. దీంతో ఉద్యోగం ఉంటుందో పోతుందోనన్న భయాందోళనతోనే జాతి కోసం బయటకు వస్తున్నట్టు ప్రవీణ్ కుమార్ ప్రకటించారని గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు బీఎస్పీలో చేరారరన్నారు. కేంద్రప్రభుత్వాన్ని ఏమైనా అంటే ఏమవుతుందోనన్న భయం ప్రవీణ్ కుమార్ లో ఉందని గాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.