Janasena Chief Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైసీపీని ఓడించేందుకు విపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉంది. అయినా.. విపక్షాలు ఇప్పటి నుంచే 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు అధికార వైసీపీలోని కొంతమంది కీలక నేతల ఓటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించాలని చూస్తోంది. ఇక ప్రతిపక్ష టీడీపీ తమకు మింగుడు పడని ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓటమికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇక బీజేపీతో కలిసి వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేస్తున్న పవర్ స్టార్, జనసేనాని పవన్కల్యాణ్ కూడా కీలక నేతలను టార్గెట్ చేశారు. ముగ్గురిని టార్గెట్ చేసినట్లు తెలిసింది.

ఆ ముగ్గురి ఓటమే లక్ష్యం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనేది ఖరారు కాకపోయినప్పటికీ ముందుగా ముగ్గురు మాజీ మంత్రులను ఎలా ఓడించాలని వ్యూహ రచన చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే పవన్ ముందు ఉన్న లక్ష్యంగా కనిపిస్తోంది. మొదటి నుంచి తనపై, తన పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నానికి కచ్చితంగా చెక్ పెట్టాల్సిందేనని జనసేనాని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా వారే..
పవన్ టార్గెట్ చేసిన ముగ్గురు మాజీ మంత్రులూ ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన నేతలే. వారి నియోజకవర్గాలు కూడా ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని, మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని నాని ఓటమే లక్ష్యంగా పవన్ పావులు కదుపుతున్నారు.
టీడీపీతో పొత్తు పొడిచినా..
ప్రస్తుతం జనసేన బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని ఇటు జనసేన నాయకులు, అటు బీజేపీ నాయకులు ప్రకటించారు. ఇదు సమయంలో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం శ్రమిస్తున్న జనసేనాని అధికార పార్టీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవద్దని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని కూడా కలుపుకుపోవాలని భావిస్తున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు పొడిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని పవన్ భావిస్తున్నారు. పొత్తులో సీట్ల సర్దుబాటు జరిగితే విజయవాడ పశ్చిమ, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాలను జనసేనకే ఇవ్వాలని టీడీపీని కోరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వ్యక్తిగత వ్యాఖ్యల నేపథ్యంలోనే..
రానున్న ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు జనసేన ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం బస్సు యాత్రను కూడా వాయిదా వేశారు. త్వరలోనే జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించనున్నట్లు జనసేనాని ప్రకటించారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులల్లో ఆనందం కలిగించింది. పవన్ టార్గెట్ చేసిన ఈ ముగ్గురు వైసీపీ మాజీ మంత్రులు మంత్రులుగా ఉన్న సమయంలో, ఆ తర్వాత కూడా పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా పవన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ ఆ ముగ్గురిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
కాపులను సమీకణకు వ్యూహం..
విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీద భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక్కడ జనసేన నుంచి పోతిన మహేశ్ పనిచేస్తున్నారు. ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకుంటే చాలనే భావనలో మహేశ్ ఉన్నారు. మచిలీపట్నంలో కాపుల ఓట్లను సమీకరించగలిగితే పేర్ని నాని మీద విజయం సునాయమవుతుందనే భావనలో జనసేనాని ఉన్నారు. అక్కడ నుంచి ఎవరిని బరిలో దింపాలనే నిర్ణయాన్ని తర్వాత తీసుకుంటారంటున్నారు. ఇక గుడివాడలో కొడాలిని ఓడించడానికి, ఆయనకు ఓటర్లుగా ఉన్న తన అభిమానులను పార్టీవైపు తిప్పే ప్రయత్నాలను ప్రారంభించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో చూడాలి.
Also Read: CM KCR- National Party: ‘పీఎం’ ఎప్పుడవుతవ్ కేసీఆర్ సారూ!